తెలుగు దేశం పార్టీ జీవితకాల అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనుషులతో మాట్టాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు  కేవలం అధికారులతోనే మాట్టాడుతూ ఉండేవారు . అందువల్ల, మనుషులకు సంబంధించిన 'జీవ' లక్షణాలతో ఆయన చాలా దూరంగా మెసలుకుంటూ ఉండేవారు. ఇప్పుడు  అలాకాదు . మనుషులు కనపడుతున్నారు. వాళ్ళ ఈతిబాధలు కనపడుతున్నాయి. వారిని దగ్గరకు తీసుకుంటున్నారు . ఓదార్చవలసిన వారిని ఓదార్చుతున్నారు. గాలిలో కాకుండా ... నేల  మీద ప్రయాణిస్తున్నారు. ఫలితంగా ప్రజల కష్టాలు తెలుస్తున్నాయి . బాధితులనుకున్నవారి ఇళ్లకు వెడుతున్నారు. ఏడుస్తున్న వారి ముక్కుల్లోనుంచి వచ్చే నీళ్లు తుడుస్తున్నారు. నేనున్నాను ..భయపడకండి అంటూ ధైర్యం ఇస్తున్నారు. లోకేష్ ఆరోగ్యం కూడా కుదుట పడింది .చొక్కాలు బాగా వదులు  అయ్యాయి. స్మార్ట్ గా కనపడుతున్నారు. 



వీరిలో ఇంత ఆహ్వానించతగిన మార్పులు రాకపోవడానికి ప్రధాన కారణం - అధికారం అనే పొగమంచు లోనుంచి బయటపడడమే. అది పొగమంచు లక్షణమే తప్ప ; చంద్రబాబు, ఆయనను నమ్ముకుని ఈ గోదా లోకి దిగిన లోకేష్ తప్పుకాదు . పొగమంచు లో చిక్కుకున్న వారికి ఎదురయ్యే వివిధ రకాల కాలుష్య బాధలే చంద్రబాబుకూ ,లోకేష్ కూ ఎదురయ్యాయి . కళ్ళు కనపడవు . చెవులు వినపడవు . స్పర్శ జ్ఞానం లోపిస్తుంది .నేల మీద నడవ బుద్ధి కాదు . గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఎదురుగా పది అడుగుల దూరం లో ఉన్న వారుకూడా స్పష్టంగా కనిపించరు. మెదడు కూడా పనిచేయకుండా మొరాయిస్తుంటుంది .



ఆ దిక్కుమాలిన పొగమంచు లోనుంచి బయటపడగానే ..ఎటు చూసినా స్పష్టతే.. ! రోడ్డు శుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది . చెవులు , కళ్ళు , మెదడుతో సహా శరీరావయవాలు చక్కగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు  చంద్రబాబు, లోకేష్ ఆ దురావస్థ నుంచి  విజయవంతం గా బయట పడ్డారు .అందుకే వారిద్దరికీ మనుషులు కనిపిస్తున్నారు . వారు చేసే ఆర్తనాదాలు బాబుకు వినిపిస్తున్నాయి . కనిపిస్తున్నాయి అని ఆ పార్టీకి చెందిన భోగాది వేంకట  రాయుడు పేర్కొంటున్నారు. చంద్రబాబును ఆ దిక్కుమాలిన అధికారపు పొగమంచులోనుంచి బయటకు తీసుకు రావడానికి ఏడాది పాటు ఊరూరా తిరుగుతూ అష్టకష్టాలు పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహనరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కధనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: