రాష్ట్రంలో
వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో జగన్పైనా, ఆయన పాలనపైనా అనేక విశ్లేషణలు వచ్చాయి. అనేక కోణాలు ఆవిష్కృతమయ్యాయి. అయితే, తాజాగా అసలు ప్రధాన ప్రతిపక్షంలో నాయకులు ఏమనుకుంటున్నారు? అదినేత చంద్రబాబు మాట ఎలా ఉన్నా.. దిగువ స్థాయి నేతల మాట ఎలా ఉంది? అనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. వీరి మాటల్లో చెప్పాలంటే.. జగన్ పాలన భేష్గా ఉందనే అభిప్రాయం వినిపిస్తుండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఐదు మాసాల పాలన సమయం నిజానికి ఏ కొత్త ప్రబుత్వానికైనా చాలా తక్కువనే చెప్పాలి.
కానీ, జగన్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల విషయంలో ఆయన సంచలనాల దిశగానేఅడుగులు వేశారు. పాలన విషయంలోనూ , రాజకీయంగా ప్రత్యర్థులను లైన్లో పెట్టుకునే విషయంలోనూతాను అనుకున్నది చేయడం, వెనక్కి తిరిగే ఆలోచనే లేకుండా ముందుకు సాగడం విషయంలోనూ జగన్కు నూటికి నూరు మార్కులు పడుతున్నాయి. ఉద్యోగాల కల్పన విషయాన్ని తీసుకుంటే.. అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లోనే లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను కల్పించి విమర్శలకు నోళ్లకు తాళం వేశారు. అదేసమయంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు.
పింఛన్లు పెంచారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నారు. రైతులకు భరోసా కల్పించడంలోనూ ముందున్నారు. ప్రతి కార్యక్రమాన్నీ ఎప్పుడో చేస్తామనేది కాకుండా నిర్దిష్ట సమయం పెట్టుకుని, ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు తలెత్తినా సమర్ధవంతంగా వాటిని ఢీ కొంటూ ముందుకు సాగుతున్నారు. వివిద ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కూడా ఎండగట్టే కార్యక్రమాన్ని తెరమీదికి తీసుకువచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా చేశారు. ఇలా పాలన పరంగా దూసుకుపోతున్నారు.
ఇక, రాజకీయంగా చూస్తే.. ప్రత్యర్థులపై పైచేయి సాధించడంతోపాటు తన సొంత పార్టీని కూడా లైన్లో పెట్టుకుంటున్నారు. పార్టీలోకి వచ్చేవారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. నిబంధనలకు లోబడి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నారు. అదేసమయంలో తలబిరుసుగా ఉండే
వైసీపీ నాయకులను తెరచాటునే హెచ్చరించి వారిని కూడా లైన్లో పెడుతున్నారు. ఇక, చింతమనేని ప్రభాకర్ వంటి ప్రతర్థ్యులను కూడా దారికి తెచ్చుకుంటున్నారు. ఇలా అన్ని విధాలా జగన్ అన్ని విషయాల్లోనూ సూపర్ సక్సెస్ అనే బావనను తీసుకు వచ్చారు. దీంతో టీడీపీలోనే జగన్ పాలనపై ఆశ్చర్యం వ్యక్తమవుతుండడం గమనార్హం.