మనుషుల్లో నేరప్రవృత్తి పెరిగిపోతోంది. తాజాగా ముంబైలో ఓ క్రూరుడు అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను కసిగా పొడిచి చంపి.. మూడు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ముంబైలోని భయాందర్ ప్రాంతంలోని నక్షత్ర అపార్టుమెంట్ 14వ అంతస్తులో నివాసం ఉండే గిరీష్ కోటే(27) అనే వ్యక్తి తన భార్య మధుబంతిని చాకుతో పొడిచి చంపి.. కసి తీరక ఆ శవాన్ని మూడు ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ కవర్లలో చుట్టేశాడు. అందులో రెండు భాగాలను ఫ్రిజ్‌లో దాచి పెట్టి, మూడో భాగాన్ని బెడ్ రూంలో దాచిపెట్టాడు. తరువాత తనకు తెలిసిన ఆటో డ్రైవర్‌ను పిలిచి విషయం చెప్పి వాటిని బయటపడేసేందుకు సహకరించాలని కోరాడు. దీంతో భయభ్రాంతుడైన ఆటో డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహం ముక్కలు స్వాధీనం చేసుకుని, అతనిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికి రెండేళ్ల బాబు ఉండగా బాలుడు తన నానమ్మ వద్ద ఉంటున్నాడు. అయితే భార్యను ఇంత కిరాతకంగా చంపడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. కానీ పోలీసుల వివరాల ప్రకారం ఈ జంట ఆర్థిక ఇబ్బందులతో అప్పడప్పుడు గొడవ పడేవారని తేలిందని, ఫైనాన్షియల్ ఇబ్బందితోనే కోటే భార్యను హతమార్చాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: