హైదరాబాద్: తన అరెస్టు రాజకీయ కుట్ర అంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మండిపడ్డారు. జగన్ వ్యవహారంలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు సలహాలు ఇచ్చారు. చట్టం తమ చేతుల్లో ఉంటే మంత్రులను, అధికారులను కాపాడుకునేవాళ్లం కాదా అని ఆమె అడిగారు. ఒక వ్యక్తి కోసం ఇంత మంది బలయ్యారని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానమే కదా అంటే, మీకు మీ సంపాదకులు ఓ బాధ్యత అప్పగించారు, మీరేం చేస్తున్నారో చూస్తున్నారా, నమ్మకం మీద బాధ్యత అప్పగించారు అని ఆమె అన్నారు. నీతిమంతుడిగా రుజువు చేసుకోవడానికి వైయస్ జగన్‌కు ఇది మంచి అవకాశమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి చేసిన తప్పునకు ఎంతో మంది నేరస్థులయ్యారని ఆమె అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోదని ఆమె అన్నారు. తప్పు చేసిన కుమారుడిని వెనుకేసుకుని రావద్దని ఆమె వైయస్ విజయమ్మకు సూచించారు. తల్లిగా విజయమ్మ తన బాధ్యత నిర్వహించాలని ఆమె అన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వైయస్ జగన్‌కు చట్టం అమలు కావాలా, వద్దా అని ఆమె అడిగారు. వైయస్ రాజశేఖరెడ్డిని 30 ఏళ్లు కాపాడి, ఎదిగేందుకు సహకరించిందని, అన్ని విధాలుగా అర్థం చేసుకుని ముఖ్యమంత్రిగా పనిచేస్తారని కాంగ్రెసు అధిష్టానం భావించిందని ఆమె అన్నారు. నిజం ఏ రోజుకైనా బయటపడుతుందని ఆమె అన్నారు. వైయస్ విజయమ్మ బాధలో తాత్కాలికంగా అలా మాట్లాడి ఉండవచ్చునని అనుకున్నామని, అలా అనుకోవడం తమ బలహీనత కాదని ఆమె అన్నారు. వైయస్ జగన్ అరెస్టు రాజకీయ కుట్ర కాదని, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే జగన్‌పై సిబిఐ చర్యలు తీసుకుందని ఆమె అన్నారు. సిబిఐ దర్యాప్తు చేస్తుంటే తమపై దుమ్మెత్తిపోస్తే ఎలా అని ఆమె అడిగారు. మోపిదేవి వెంకటరమణ నిర్దోషి అని ముఖ్యమంత్రి ఎలా అంటారని అడిగితే తన మంత్రివర్గంలో పనిచేసిన మోపిదేవిపై నమ్మకంతో అలా అని ఉంటారని ఆమె జవాబిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: