దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ వేత్తగా రికార్డును సృష్టించిన వ్యక్తి దీపక్ రెడ్డి. ఇటీవలే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడీయన. ఆ సందర్భంలో ఆస్తుల ప్రకటనతో దీపక్ రెడ్డి సంచలనం సృష్టించాడు. దాదాపు నాలుగైదు వేల కోట్ల ఆస్తులు చూపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైనింగ్ రూపంలో ఆ ఆస్తులన్నీ ఉన్నట్టు ఆయన తెలిపాడు. దీపక్ రెడ్డి అత్యంత ధనిక రాజకీయ వేత్త అని అధికారికంగా ధ్రువీకరణ అయ్యింది. అయితే అన్ని వేల కోట్ల ఆస్తులున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలను మెప్పించలేకపోయాడు దీపక్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో దీపక్ రెడ్డి ఓటమిపాలయ్యాడు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఇన్ని రోజుల పాటూ రాయదుర్గం నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగాడు దీపక్ రెడ్డి. మరి ఇప్పుడు ఏమైందో ఏమో కానీ దీపక్ రెడ్డి తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. తాను రాయదుర్గం ఇన్ చార్జిగా ఉండలేనని అన్నాడు. తెలుగుదేశం పార్టీలో తనకు విలువ లేదని, తెలుగుదేశం వాళ్లు తన నియోజకవర్గంలో మరో అభ్యర్థిని రెడీ చేశారని, దీంతో తాను నియోజకవర్గ బాధ్యతలు వద్దనుకొంటున్నట్టు దీపక్ రెడ్డి ప్రకటించాడు. వేరే అభ్యర్థిని నియమించుకోవచ్చని ఆయన ప్రకటించాడు. ఈ విధంగా ఒక ధనిక రాజకీయ వేత్తకు తెలుగుదేశంతో అనుబంధం తెగిపోతోంది. దీపక్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీతో చుట్టరికం కూడా ఉంది. జేసీ వాళ్లు కాంగ్రెస్ లో ఉంటూనే దీపక్ రెడ్డిని తెలుగుదేశంలో ఎంకరేజ్ చేశారు. మరి ఇతడి తరువాతి రాజకీయ గమ్యం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: