మనరాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మళ్లీ పెళ్లి కొడుకయ్యాడు. లేటు వయస్సులో లేటెస్టుగా పెళ్లి చేసుకున్నారు. తివారీ తన 88వ యేట మళ్లీ పెళ్లికొడుకు అయ్యారు. తన మాజీ ప్రేయసి ఉజ్వలా శర్మను శాస్త్రోక్తంగా మనువాడారు. పెళ్లితో కొంతకాలంగా వార్తల్లో నిల్చిన వివాదానికి తివారీ శుభం కార్డు పలికారు. గురువారం లక్నోలో జరిగిన ఈ వివాహా కార్యక్రమానికి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నట్లు ఉజ్వలా శర్మ చెప్పారు. వివాహ ప్రతిపాదనను ముందు తివారీ తెచ్చారని తెలిపారు. ఎన్డీ తివారీనే తన తండ్రి అంటూ... ఉజ్వలా కుమారుడు రోహిత్ శేఖర్ 2008లో కోర్టులో దావా వేశాడు. అయితే తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని తల్లి ఉజ్వలా శర్మను తివారీ వివాహం చేసున్నట్లు తెలుస్తోంది. తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు రాజ్ భవన్ లో యువతులతో రాసలీలలు సాగించి పదవి పోగొట్టుకున్నారు. ఈ విషయం అప్పట్లో సంచలనమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: