గాలి ముద్దుకృష్ణమనాయుడు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ ఇద్దరు నేతలూ తిట్టినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని మరెవరూ తిట్టి ఉండకపోవచ్చు. మామూలుగా రాజకీయ నేతలు విమర్శలు చేస్తారు.. అయితే గాలి, సోమిరెడ్డిలు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. ప్రత్యేకించి వీళ్లు వైఎస్ ఫ్యామిలీ అంటే మరింతగా రెచ్చిపోతారు.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలను ఎంచుకొంటారు. జగన్ మోహన్ రెడ్డి మాటలను.. సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను వీళ్లు పోస్టు మార్టం చేస్తారు. జగన్ ను ఎవరు కలిశారు.. జగన్ ఎవరితో మీట్ అయ్యాడు..అనే అంశాల గురించి వీరు అనునిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వాటిని ఆధారంగా చేసుకొని జగన్ పై సరికొత్త విమర్శలు చేస్తారు. అంతిమంగా జగన్ ను అవినీతిపరుడు, దోపిడీదారు అని తిట్టడమే వీరి లక్ష్యం.

మరి ఈ లక్ష్యంలో వీళ్లు విజయవంతం అవుతున్నారేమో కానీ..బాబును మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. వీరికి ఎమ్మెల్సీ సీట్లు దక్కలేదని స్పష్టత వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయంసాధించలేకపోయిన వీళ్లు ఎమ్మెల్సీలవుదామని ప్రయత్నిస్తున్నారు. అయితే బాబు మాత్రం వీరికి ఆ అవకాశం ఇవ్వలేదు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో కూర్చొని అనునిత్యం జగన్ పై దుమ్మెత్తిపోసినా వీరికి కోరుకొన్న పదవులైతే దక్కలేదు. బహుశా వీరి సేవలను తెలుగుదేశం అధినేత గుర్తించలేదేమో! ఎప్పటికి గుర్తించేనో!

మరింత సమాచారం తెలుసుకోండి: