మేరా భారత్ మహాన్.. మనలో ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే మాట ఇది. ఇందుకు మనం అనేక సాక్ష్యాలు చూపుతాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతం.. వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర, వేదకాలంలోనే అభివృద్ధి చెందిన సమాజం మనదని సగర్వంగా మాట్లాడతాం. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధినీ సాక్ష్యాలుగా చూపుతాం.
అవన్నీనిజమే కాదనలేం. కానీ అదంతా నాణానికి ఒకవైపే.. గాంధీజీ చెప్పినట్టు భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది. మరి మన పల్లెలు ఎలా ఉన్నాయి. గ్రామీణ సమాజంలోని వాస్తవాలేంటి.. వీటిని కళ్ల ముందు నిలిపింది తాజా సామాజిక ఆర్థిక కుల గణన నివేదిక. మొత్తం దేశంలో పాతిక కోట్ల కుటుంబాలంటే.. అందులో రెండున్నర కోట్ల కుటుంబాలు కేవలం ఒక్క గదిలోనే నివాసం ఉంటున్నాయి.
ఇదీ మన పల్లె భారతం..
దాదాపు ఐదున్నర కోట్ల కుటుంబాలకు భూమి లేదు. కేవలం కాయకష్టం చేసుకుని జీవనాధారం వెళ్లదీస్తున్నాయి. 9 కోట్ల కుటుంబాలు దినసరి కూలీపై ఆధారపడి జీవిస్తున్నాయి. గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి భూమిలేదట.
మొత్తం పాతిక కోట్ల కుటుంబాల్లో పదకొండు కోట్ల కుటుంబాలు ఇంకా దారిద్ర్యరేఖ దిగువనే బతుకీడుస్తున్నాయి. అంటే దాదాపు సగం భారతం దారిద్ర్యంలోనే ఉందన్నమాట. మన దేశ పల్లెల్లో మూడోవంతు కుటుంబాల సగటు నెలసరి ఆదాయం 5వేల రూపాయలలోపే ఉందట. దాదాపు 10 లక్షల కుటుంబాలు అడుక్కుంటూనో, చెత్త ఏరుకుంటూనో జీవనం సాగిస్తున్నాయట. ఇదీ భారత పల్లెల నగ్నచిత్రం.