గుంటూరులో జగన్ ప్రత్యేక హోదా కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జగన్ పై తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ దీక్ష సందర్భంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో హింస ప్రేరేపించేందుకు వైసీపీ బడా ప్రణాళికలు రచిస్తోందని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రమంతటా బస్సులు తగులబెట్టాలని.. కలెక్టర్‌ ఆఫీసులు ధ్వంసం చేయాలని.. వ్యూహాలు పన్నుతున్నారని లోకేశ్ ఆరోపించారు. 

వైసీపీ అలాంటి కుయుక్తులు పన్నితే.. సహించేది లేదని లోకేశ్ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఇలాంటి ప్రకటనలే  చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అమాయక యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపించే నీచ రాజకీయం కూడా సాగుతోందని మండిపడ్డారు. అలాంటి వైసీపీ నేతల కుట్రల ఫలించనీయబోమన్నారు లోకేశ్. 

వైసీపీ నేతలకు నేను ఒక్కటే చెబుతున్నా.. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కార్యాలయ అద్దం పగిలినా... ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా... అందుకు జగన్‌నే బాధ్యున్ని చేస్తాం.. అలాంటి కేసులో జగన్ నే ఏ-1 ముద్దాయిగా చేర్చేలా పోరాడతాం.. అని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. 

వైసీపీలా తమకు దొంగ పేపర్ .. దొంగ ఛానల్ లేదని.. లక్షలాదిగా ఉన్న కార్యకర్తల బలమే తమ శక్తి అని లోకేశ్ చెప్పుకొచ్చారు. మా కార్యకర్తలు కళ్లు తెరిస్తే నువ్వు తట్టుకోలేవ్.. అంటూ జగన్ కు సినీ తరహాలో వార్నింగ్ ఇచ్చారు. సింగపూర్‌లో తమకు ఆస్తులున్నాయని ఆరోపణలు చేస్తున్న జగన్.. కనీసం ఒక్క ఆధారం చూపినా రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు. జగన్‌ నిరవధిక నిరాహారదీక్ష నేపథ్యంలో లోకేశ్ హాట్ కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: