ఆహా.. ఎలాంటోడు.. ఎలా అయిపోయాడు! సైకిల్పై హాయిగా, జాలీగా తిరిగేవాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లేవాడు..! ఇంత పొడుగు ముచ్చటచెబుతుంటే.. అన్న పెద్దపోటుగాడు..అంటూ అనుచరుల పొగడ్తలు! సీన్ కట్ చేస్తే.. ఓటుకు నోటు పోటుతో బాబుగారు పరారు.. రేవంత్ బేజారు..! ఆ తర్వాత చెయ్యెత్తి జైకొట్టాడు. తెలంగాణను హస్తగతం చేయాలనుకున్నాడు.. అవసరం లేదంటూ కోడంగల్ జనం మూటముల్లె సర్ది సాగనంపారు..! పాపం పోనీలే అంటూ.. కాలం కనికరించింది. పార్లమెంట్కు పంపింది. ఇక తనకు ఎదురేలేదనుకున్నాడు. తెలంగాణకు డాన్లా ఎదగాలని కలలుకన్నాడు.. చివరికి డ్రోన్ కెమెరా రెక్కలకు చిక్కి జైలుపాలయ్యాడు. బెయిల్.. బెయిల్ అంటూ మొత్తుకున్నా నో బెయిల్ గంటలే మోగుతున్నాయి. అయ్యయ్యో.. ఏమిటీ పరాభవం! ఎందుకీ దుస్థితి! తలంత బలగం ఉన్నా తలకుపోసే దిక్కులేకుండా పోయింది..! అయినా.. సమష్టి ఎజెండాను పక్కనబెట్టి.. సొంత ఎజెండాతో ముందుకెళ్తూ అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలనుకుంటే.. ఇలా పట్టుబడడం తప్ప ఫలితమేమీ ఉండదని ఇప్పుడైనా తెలిసివస్తుందేమో..!
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని, తనకు బెయిల్ మంజూరుకు తిరస్కరించిన మియాపూర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వేర్వేరుగా దాఖలు చేసిన మూడు రిట్ పిటిషన్లను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. రేవంత్ చర్యలన్నీ రాజకీయ ప్రయోజనం కోసమేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.
ఇరుపక్షాల వాదనల తర్వాత తదుపరి విచారణ 17కి వాయిదా పడింది. మరోవైపు డ్రోన్ కెమెరా కేసులో రేవంత్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టీఆర్ఎస్ లోక్సభపక్ష నేత నామానాగేశ్వరరావు పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ కావాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ ప్రతికూల పరిస్థితులు తప్పేలా లేవు. ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసారు. దీంతో పార్టీలో రేవంత్ రవ్వంతలా మిగిలిపోవడం ఖాయమని పలువురు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.