అవును రెండు రోజుల మహానాడులో చంద్రబాబునాయుడు సమస్య ఏమిటో బయటపడింది. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన దగ్గర నుండి మళ్ళీ నరేంద్రమోడికి ఎలా దగ్గరవ్వాలా అని నానా అవస్తలు పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అయితే చంద్రబాబు ఎన్ని విన్యాసాలు వేస్తున్న అటువైపు అంటే మోడి వైపు నుండి ఎటువంటి కదలిక కనబడటం లేదు. చివరకు ఫలితాలు వచ్చిన వెంటనే నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపించాడు. ఎంపిలనైతే తీసుకున్నారు కానీ చంద్రబాబును మాత్రం దగ్గరకు రానీయలేదు. దాంతో చివరకు మహానాడు సందర్భంగా కేంద్రానికి అంశాలవారీగా మద్దతు ఇవ్వాలనే తీర్మానం కూడా చేయించాల్సొచ్చింది.

 

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశాడు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చాడో వెంటనే కాంగ్రెస్ పంచన చేరాడు. సోనియా, రాహూల్ గాంధీలతో సన్నిహితమైపోయాడు. చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో బిజెపి బలం దారుణంగా పడిపోతుందని, ఎన్డీఏ అధికారంలోకి రాదని. అందుకనే ధైర్యంగా మోడిని నానా మాటలన్నాడు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక, ఒడిస్సా, ఢిల్లీ ఎన్నికల్లో మోడికి వ్యతిరేకంగా అనేక బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నాడు. చంద్రబాబు ఏ స్ధాయికెళ్ళిపోయాడంటే పై రాష్ట్రాల్లోని ఎన్నికల్లో టిడిపి పోటి చేస్తున్నంతగా కలరింగ్ ఇచ్చుకున్నాడు.

 

సీన్ కట్ చేస్తే 2014 కన్నా 2019 ఎన్నికల్లో  మోడి బలం మరింతగా పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో టిడిపి దారుణంగా ఓడిపోయింది. నిజానికి ఈ రెండు కూడా చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంచనాలన్నీ తప్పటంతో దిక్కుతోచలేదు. దాంతో వైజాగ్ వెళ్ళినపుడు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఏలో నుండి బయటకు వచ్చేసి తప్పు చేశానంటూ చెంపలేసుకున్నాడు. మామూలుగా తాను చేసిన తప్పులను చంద్రబాబు ఎప్పటికీ ఒప్పుకోడు. అలాంటిది ఎందుకు బహిరంగంగా ప్రకటన చేశాడంటే మళ్ళీ మోడి దగ్గరయ్యేందుకే అని వేరే చెప్పక్కర్లేదు.

 

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు గూబ గుయ్యిమనటంతో మళ్ళీ మోడి తప్ప తనకు వేరే దారిలేదని అర్ధమైపోయింది. అప్పటి నుండి మోడితో ఏదో ఓ రూపంలో రాయబారాలు పంపుతునే ఉన్నాడు. కానీ మోడి వైపు నుండి మాత్రం ఎటువంట స్పందన కనబడలేదు. దాంతో వేరే దారిలేక చివరకు మహానాడులో కేంద్రానికి అంశాల వారీగా మద్దతివ్వాలంటూ ఓ రాజకీయ తీర్మానం కూడా చేయించాడు. విచిత్రమేమిటంటే గడచిన ఏడాది కాలంగా కేంద్రంలో మోడికి టిడిపి ఎంపిలు మద్దతు ఇస్తునే ఉన్నారు.

 

అయినా కేంద్రానికి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలంటూ మహానాడులో తీర్మానం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. చంద్రబాబు ఆలోచనలన్నీ ఇలాగే విచిత్రంగా ఉంటాయి. మహానాడులోనే రాజకీయ తీర్మానం చేసిన తర్వాతైనా మోడి మనసు కరగకపోతుందా అని చంద్రబాబు ఆలోచించినట్లున్నాడు. అందుకనే పార్టీ తరపున మద్దతు తెలుపుతు తీర్మానం చేయించాడు. మరి మోడి మనసు ఇపుడైనా కరుగుతుందా ? వెయిట్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: