ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. వైసిపిలో చేరమని మాజీమంత్రి అచ్చెన్నాయుడును వైసిపి నేతలు ఒత్తిడి పెట్టారట. చేరేందుకు నిరాకరిస్తే వందల కోట్ల రూపాయలు ఆఫర్ కూడా చేసిందట. అయినా కూడా వైసిపిలో చేరేందుకు ఇష్టపడకపోవటంతోనే ఇపుడు అరెస్టు చేశారంటూ చంద్రబాబు మతిలేని ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు చేసిన ఆరోపణలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే టిడిపి నేతలే నవ్వుకుంటున్నారు. విచిత్రమేమిటంటే తన ఆరోపణలకు చంద్రబాబు ఆధారాలను మాత్రం చూపలేదు.

 

అసలు అచ్చెన్న అవసరం వైసిపికి ఏముంది ? అనేది సింపుల్ ప్రశ్న. నిజానికి 151 మంది ఎంఎల్ఏలతో బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నుండి ఎంఎల్ఏలను లాక్కోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ కారణంతోనే ఇప్పటికే టిడిపికి దూరమైన ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ లను పార్టీలో చేర్చుకోలేదు. నిజంగానే టిడిపి ఎంఎల్ఏలను చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు.  జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే  ఇప్పటికిప్పుడు టిడిపి నుండి కనీసం 12 మంది ఎంఎల్ఏలు బయటకు వచ్చేయటానికి రెడీగా ఉన్నారనే ప్రచారాలు అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి సమయంలో అచ్చెన్నను వైసిపిలో చేర్చుకోవాలని ఎవరు అనుకుంటారు ? అసలు మాజీమంత్రికి ఆఫర్ ఇచ్చింది ఎవరు ? అన్న విషయాలను మాత్రం చంద్రబాబు చెప్పటం లేదు. ఏదో గాలినిపోగేసి వందల కోట్ల ఆఫర్ ఇచ్చారని చెప్పేస్తుండటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు చేసిన తాజా ఆరోపణలు చూస్తుంటే తన హయాంలో జరిగిన ఫిరాయింపులపై అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాను అధికారంలో ఉన్నపుడు వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇపుడు అచ్చెన్న ఒక్కడికే వైసిపి వందల కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తే మరి తాను లాక్కున్న 23 మంది ఎంఎల్ఏలకు చంద్రబాబు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చుండాలి ? అప్పట్లో ఉత్త ఆఫరే కాదు 23 మందిని చేర్చుకున్నాడు. పైగా అలా వచ్చిన వాళ్ళల్లో నలుగురికి మంత్రులను కూడా చేశాడు. అంటే ఎంఎల్ఏలుగా ఫిరాయించటానిక ఒక రేటు, మంత్రిని చేయటానికి మరో రేటు ఇచ్చినట్లే కదా ? దీని ప్రకారమే చంద్రబాబు అప్పట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అర్ధమవుతోంది.

 

అప్పట్లో ఎంఎల్ఏలను లాక్కోవటానికి చంద్రబాబు చూపించిన దారిలోనే ఇపుడు వైసిపి కూడా వెళుతుంటే అంత ఉలుకెందుకు ?  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయాల్లో సకల దరిద్రాలకు చంద్రబాబే ఆధ్యుడని అర్ధమైపోతోంది. ఇంత చెప్పిన చంద్రబాబు మాజీమంత్రి అచ్చెన్న ఇఎస్ఐ కుంభకోణంలో ఇరుక్కోలేదని చెప్పటం లేదు. ఎంతసేపు బిసి నేతపై వేధింపులని, కిడ్నాప్ చేశారని, గోద దూకి ఇంట్లోకి వెళ్ళారనే పనికిమాలిన విషయాలే మాట్లాడుతున్నాడు. కాబట్టి చంద్రబాబు ఆరోపణల్లో పసలేదని తేలిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: