భార‌తీయ జాతీయ‌వాదాన్ని బ‌లంగా వినిపించిన నేత‌ల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయ‌న ఆలోచ‌న‌ల నుంచే 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ పురుడుపోసుకుంది.  ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6 న కోల్‌కతలో అశుతోష్ ముఖర్జీ, జోగ్‌మాయా దేవి ముఖర్జీల‌కు జ‌న్మించాడు. ముఖర్జీ డిగ్రీ విద్యాభ్యాసం కోల్‌కత లోనే కొనసాగింది. 1924 లో కలకత్తా హైకోర్టులో అడ్వకేట్‌గా పేరు నమోదుచేసుకున్నాడు. ఆ తరువాత ఇంగ్లాండుకు పయనమై 1927లో బారిష్టరు పట్టా పొందాడు. 1934లో 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వ విద్యాలయపు కులపతిగా నియామ‌కమ‌య్యాడు. పిన్న వయస్సులో ఈ పదవిని పొందిన ఘనత ఆయ‌న సొంతం.1938 వరకు ముఖర్జీ ఈ పదవిలో కొన‌సాగాడు.


అప్ప‌టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత ఎం.ఎస్.గోల్వార్కర్తో చర్చలు జరిపిన అనంతరం అక్టోబరు 21, 1951న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించాడు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించాడు. నెహ్రూ సోషలిజానికి భిన్నంగా జనసంఘ్ పార్టీ స్వేచ్ఛా మార్కెట్ విధానానికి మద్దతు పలికింది. అంతేకాకుండా దేశం మొత్తానికి హిందువులు, ముస్లిములకు ఒకే విధమైన పౌర స్మృతి ఉండాలని ఉద్ఘాటించింది. గోహత్య, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపింది. 1952లో జరిగిన ఎన్నికలలో జనసంఘ్ పార్టీ 3 స్థానాలలో విజయం సాధించగా, అందులో ఒక స్థానం నుంచి ముఖర్జీ విజయం సాధించాడు.

 

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారతీయ జాతీయ కాంగ్రెసు విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని పేర్కొన్నాడు. తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి, గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల 1953లో కాశ్మీర్ వెళ్ళి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్ద మే 11 న అరెస్టు అయ్యాడు. అతని ప్రయత్నం వల్ల గుర్తింపుకార్డు నియమం తొలిగించబడిననూ అంతవరకు ముఖర్జీ సజీవంగాలేడు. జూన్ 23, 1953 న కస్టడీలోనే ముఖర్జీ ప్రాణాలు వదిలాడు. ముఖర్జీ మరణంపై అనుమానాలు తలెత్తి విచారణ జరుపవలసిందిగా కోరిననూ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరుపలేదు. ముఖర్జీ తల్లి జోగ్మాయా దేవి ప్రత్యేకంగా ప్రధాని నెహ్రూను కోరిననూ ఫలితం దక్కలేదు. ముఖర్జీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదమైన అంశంగానే మిగిలిపోయింది.

 


 1960, 70 దశకాలలో భారతీయ జనసంఘ్ పార్టీకి ఆ తదనంతరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి దోహదపడిన అటల్ బిహారీ వాజపేయికి శ్యాంప్రసాద్ ముఖర్జీ మంచి మార్గనిర్దేశం చేశాడు. 1998 ఆగస్టు 27 నాడు అహ్మదాబాదు కార్పోరేషన్ ఒక వారధికి ముఖర్జీ పేరు పెట్టింది. 2001లో భారత పరిశోధనా సంస్థ అయిన సీఎస్ ఐఆర్ ముఖర్జీ పేరిట ఫెల్లోషిప్‌ను స్థాపించింది .శ్యాంప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ భారతదేశంలో పిహెచ్‌డి చేయడానికి ఒక అత్యున్నతమైన ఫెలోషిప్‌గా గుర్తింపు పొందినది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ చేసిన మొదటి 20% వారికే ఈ అర్హత పరీక్షకు అవకాశం ఉంటుంది. 2015 లో భారత ప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ని ప్రారంభించింది, దీని లక్ష్యం 300ల రూర్బన్ ప్రాంతాలని పట్టణ కేంద్రాలుగా తిర్చిదిద్ది మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: