డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 - ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞలతో దాదాపు 6దశాబ్దాల పాటు తెలుగు రంగస్థల, సినిమా రరంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు కళారంగానికి ఆయన వారధిలా నిలిచారు. రంగస్థలంపై ఎంతో పేరు గడించిన ఆయన ఆ తర్వాత సినిమా కథకుడిగా, మాటల రచయితగా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకున్నారు. ఆయన కథల కోసం దర్శకులు, హీరోలు నిరీక్షించిన రోజులున్నాయి. ఆయన కథ రాశారని వినకుండానే ఒకే చేసిన సందర్భాలున్నాయంటే అతిశేయోక్తి లేదు.
1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు. నరసరాజు హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నారు. 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశారు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డారు. 1951లోపాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశారు.
అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చారు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్లో నటించారు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించేది.అనారోగ్యంతో 2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.