నగరానికి విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా,వీటితో ప్రజారోగ్యానికి చేటు మరియు ప్రభుత్వ ఆదాయానికి గండి.కేవలం బంగారం,ఎలక్ట్రానిక్ వస్తువులు,మాదకద్రవ్యాలు మాత్రమే కాకుండా ఇప్పుడు సిగరెట్లు సైతం భారీ ఎత్తున నగరానికి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతుంది అని,అధికారులు పేర్కొంటున్నారు. నగరానికి అక్రమంగా వచ్చిన సిగరెట్లను హోల్సేల్గా విక్రయిస్తున్న వ్యక్తిని తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకొన్నారు.
అసలు ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు,ఇండోనేషియా టు హైదరాబాద్ వయా దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ తో సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో భారీగా అక్రమ రవాణా జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇలా నగరానికి వచ్చిన సిగరెట్లను సంతోష్ దవే అనే వ్యక్తి తన వద్ద స్టాక్ చేసుకుని,హోల్సేల్గా రిటైలర్లకు ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నాడు.ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్కు ఈ విషయంపై సమాచారం అందటంతో ,ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ మరియు సిబ్బంది సంస్థపై దాడి చేసి, సంతోష్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆరోగ్యానికి హానికరమైన మరియు స్థానిక వ్యాపారులకు నష్టం తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ఏమాత్రం ప్రోత్సహించదు అని తెలిపారు.చాలామంది కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టడానికే,నగరం లోని ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులు చెప్పారు . ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా అటు పన్ను పోటు, ఇటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పూర్తిగా పరీక్షించి సర్టిఫై చేస్తారని తెలిపారు.
అక్రమ రవాణాలో ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తాయిని హెచ్చరిస్తున్నారు. దీనికితోడు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండబోవని, ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని అధికారులు సూచిస్తున్నారు.