సహజంగా ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలు మమతలతో కూడిన అనుబంధాలుగా ముడిపడి ఉండేవి. కానీ ప్రస్తుతం మనుషుల మధ్య కేవలం డబ్బులతో కూడిన బంధాలు మాత్రమే ఉంటున్నాయి. మనుషుల మధ్యన ఉండాల్సిన సున్నితమైన మానవ బంధాలు ఛిద్రమవుతున్నాయి. సమాజంలో మనుషుల మధ్య బంధాలు బలహీనపడి.. స్వార్థాలు పెరిగిపోతున్నాయి.
అయితే బంధాలు విడిపోవడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు. మనిషి నోటిదురుసు కూడా ఒక కారణమని చెప్పాలి. డబ్బు మనిషిని బానిసను చేస్తే మాట బంధాన్ని ముక్కలు చేస్తుంది. వాస్తవానికి బిజీ అనే పేరుతో లైఫ్ను గడిపేస్తూ.. ఈగో అన్న పేరుతో బంధాలను కట్ చేస్తున్నారు. ఇలాంటి సమాజంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితే సాటి మనిషిగా మనుషులు సాయపడకపోగా మొబైల్లో వీడియోలు తీయడం మనం చూస్తేనే ఉంటాం. అయితే అలా చేయడం మనుషులకే సాధ్యమని.. కుక్క జాతికి అలాంటి బుద్ధి లేదని ఒకకుక్క నిరూపించింది.
రామనగర శివారులో అర్చకరహళ్లి వద్ద రహదారిపై అపరిచిత వాహనం ఢీకొని ఒక కుక్క మృతి చెందింది. కుక్క కళేబరం ముందు మరో కుక్క చాలాసేపు రోదిస్తూ మృతి చెందిన కుక్కను లేపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. దరిదాపులకు ఎవ్వరినీ రానివ్వలేదు. అది చూసిన స్థానికులకు కన్నీళ్లు తెప్పించాయి. నిజానికి అలాంటి అపురూపమైన బంధాలు కొందరు మనుషుల మధ్య లేకపోవడం బాధాకరం.