అన్నం తినేప్పుడు వెంట్రుక వస్తే ఆ తర్వాత నోట్లోకి ముద్ద పోదు. ఆకలి వేసినా తినాలని అనిపించదు. తీసి పక్కన పడేస్తాం. చాలా సందర్భా్ల్లో ఇలా వస్తే కోపంతో హెచ్చరించి వదిలేస్తాం. కానీ, ఓ భర్త తినే తిండిలో వెంట్రుక వచ్చిందని కట్టుకున్న భార్యపై దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను చితకబాది, గుండు కొట్టాడు. ఈ అమానవీయ ఘటన బంగ్లాదేశ్‌లోని జోయ్‌పుర్హాత్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బబ్లూ మాండల్(35) అనే వ్యక్తికి తన భార్య(23) ఉదయం పూట అల్పాహారం కింద అన్నం, పాలు వడ్డించింది. దానిలో ఓ వెంట్రుక రావడంతో భార్యపై కోపంతో ఊగిపోయాడు. విచక్షణ కోల్పోయి ఓ బ్లేడు తీసుకొని వచ్చి ఆమెను బలవంతంగా కూర్చోబెట్టి, గుండు కొరిగాడు. ఆపై ఆమెను శారీరకంగా హింసించాడు. చుట్టుపక్కల వాళ్లు ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.


భార్యను వేధించిన కేసు కింద అతడిపై కేసు నమోదు చేసి, కటకటాల్లోకి నెట్టారు. అతడిపై ఉన్న కేసు నిర్ధారణ అయితే 14 ఏళ్ల పాటు జైల్లో చిప్ప కూడు తినాల్సి వస్తుందని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా, మానవ హక్కుల సంఘాలు ఆందోళన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: