శ్రీరామచరిత్రలో అతి ముఖ్యమైనదీ సుదీర్ఘమై నదీ ఆయన చేసిన వనవాసం. పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్లు వచ్చే వరకూ వన సీమలలోనేసంచరించాడు. శ్రీరాముడు మనదేశం లో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. 14 సం.ల సుదీర్ఘ కాలం లో ఆయన అయోధ్య లో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకూ ప్రయాణంచేశాడు. ఆ తరువాత సేతు నిర్మాణం గావించి లంక లో రావణ సంహారం చేసాడు. ఇంత కాలం పాటు ఆయన ఏయేచోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే మనం కూడా ఆయన నడచిన దారుల్లో నే ప్రయాణించి ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము.

శ్రీరాముడు తన వనవాస సమయంలో 


శ్రీరాముడు తన వనవాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకోవడానికి 
డా॥.రామావతార్ గారు మొదలైన పరిశోధకులు చాలామందిరామాయణం లో శ్రీ వాల్మీకి వర్ణనలు ఆధారంగా అయోధ్య నుంచి రామేశ్వరం వరకూ విస్త్రృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలను బట్టి వారు మొదట 189 ప్రాంతాలనూ తరువాత మరోక 60 ప్రదేశాలనూ కనుగొన్నారట. ఈ వివరాలన్నీ శ్రీ రామావతార్ గారి  శ్రీ రాముని అడుగుజాడల్లో  (In the foot steps of Shri Ram) అనే పుస్తకంలో వివరించారు.  

 స్వతంత్ర భారత మొదటి రాష్ట్రపతి అయిన  శ్రీ డా.।। బాబూ రాజేంద్రప్రసాద్


డా.।। రామావతార్ శర్మ గారు స్వతంత్ర భారత మొదటి రాష్ట్రపతి అయిన  శ్రీ డా.।। బాబూ రాజేంద్రప్రసాద్ గారి గురువు గారు శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి మొదట అక్కడికి 20కి. మీ దూరంలోని తమసా నదీ తటాన ఉన్న మాండా(Mandah) అనే ప్రాతాన్ని చేరుకున్నారు. ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. ఆ తరువాత తమ కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాద రాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు 20 కి.మీ దూరంలోని నిషాద రాజ్యంలోని శృంగవేరపురం (Srigraur)చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి బయలు దేరి త్రివేణీ సంగమ ప్రాంతం లో యమునా నదిని దాటి ఉత్తర- మధ్యప్రదేశ్ల సరిహద్దుల్లోని చిత్రకూటాన్ని చేరుకున్నారు. ఈ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం,మాండవ్య ఆశ్రమం,భరత్ కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీ రామ పాదుకల్ని తీసుకు వెళ్లడానికి భరతుడు వచ్చివెళ్లాక వారు చిత్రకూటాన్ని వదలి మధ్యప్రదేశ్లోని సతానా ప్రాంతంలో ఉన్న*అత్రి ఆశ్రమాన్ని* చేరుకున్నారు. ఇక్కడ నుండి శ్రీ రాముడు ఇప్పటి మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు.దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు పది సం.లు విహరించాడు. ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు ఫలవృక్ష సంపద వారినంతగా ఆకర్షించాయేమో? 


సత్నా ప్రాంతంలోని శర్భంగ, సుతీక్షణ మున్యాశ్రమాలను దర్శించుకుని నర్మదా,మహానదీ తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేకమైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకుని వారు తిరిగి సుతీక్షణ ముని ఆశ్రమానికిచేరుకున్నారు. ఇప్పటికీ పన్నా, రాయపూర్,బస్తర్, జగదల్ పూర్ ప్రాంతాల లో మాండవ్య ఆశ్రమం, శృంగి ఆశ్రమం, రామలక్ష్మణ మందిరం, కోటిమాహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత అనేకమైన చిన్న చిన్న నదులూ వాగులూ సరస్సులూ కొండలూ దాటుకుంటూ శ్రీ రాముడు నాసిక్ ప్రాంతంలోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు. ఇక్కడి అగ్నిశాలలో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి పేర్కొన్నాడు.


అగస్త్యాశ్రమం నుంచి బయల్దేరిన శ్రీరాముడు నాసిక్ సమీపంలోని పంచవటిచేరుకున్నాడు. ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలుండడం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. శూర్పణఖ వృత్తాతం, ఖరదూషణుల వధ జరిగిన ప్రాంతమిదే. (ఖరదూషణుల వధ క్రీ.పూ 5077-5077 అక్టోబరు 7వ తేదీన జరిగిందని ఒక అంచనా). ఈ ప్రాతంలో మారీచ వధ జరిగిన చోట మృగయాధీశ్వర్, వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయి. 


నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు: సీతాసరోవరం రామకుండం, త్రయంబకేశ్వరం, జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి. సీతాపహరణం జరిగినది ఈ ప్రదేశం (జనస్థాన్)లోనే. సీతాపహరణం తర్వాత దారిలో తననడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు తృంచిన ప్రాంతం నేడు సర్వతీర్థ మని పిలువబడుతోంది. ఇది నాసిక్ పట్టణానికి 56 కి.మీ దూరంలోని తకేడ్ గ్రామం వద్ద ఉంది.


సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన రామలక్ష్మణు లు దారిలో జటాయువు, కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యమూకపర్వతాన్ని చేరుకున్నారు. ఈ దారిలోనే వారు శబరి ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది.ఆ ఆశ్రమమున్న పంపాసరోవర ప్రాంతం నేడు కర్ణాటక రాష్ట్రం లోని బెల్గాం దగ్గరున్న సురేబన్గా గుర్తించ బడింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేగు చెట్లు అధికంగా ఉండడం విశేషం. (భక్త శబరి శ్రీ రాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్ళను తినిపించింది అన్నది ఐతిహ్యం). ఇక్కడి నుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలనూ మంచి సరస్సులనూదాటుకుంటూ  శ్రీ రామ లక్ష్మణులు ఋష్యమూకాన్ని చేరుకున్నారు. ఈ ఋష్యమూకం, కిష్కంధ ప్రస్తుత కర్నాటక బళ్ళారి జిల్లాలోని హంపీ ప్రాంతం. ఇక్కడే వారు హనుమాన్, సుగ్రీవు లను కలుసుకోవడం వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది.


ఇక్కడ వాలిని సంహరించిన పిదప శ్రీ రాముడు వానర సేనతో కలసి దక్షిణ దిశగా సముద్రం వైపు ప్రయాణించాడు. మలయ పర్వతాన్నీ , గంధపు వృక్షాల వనాల్నీ సరస్సులనూదాటుకుంటూ కావేరీ తీరం చేరాడు. ఆ తర్వాత తిరుచ్చిరాపల్లి, తంజావూరు, రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు.చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణం లో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ భౌగోళికం గా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాల తో సరిగా సరిపోవడం. రామాయణంలో గంగా యమునల సంగమ ప్రాంతంగా చెప్పబడ్డ పరిసరాల్లో (కోల్డిహ్వా, ఝూసీ,హేటాపట్టి లలో) పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాతం క్రీ.పూ. ఆరు, ఏడు వేల సం.ల నుంచీ జనావాసాలుగా ఉండేవనిగుర్తింపబడ్డాయి. త్రివేణీ సంగమ తీరంలో అలహాబాదులోని ఆనంద భవన్ (నెహ్రూ గారిఇల్లు)కి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి భరద్వాజ ఆశ్రమం. ఇక్కడా, శృంగవేరపురాల్లోనూ జిరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబందించిన ముఖ్యమైన ఆధారాలు లభ్యమయాయి.
(శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ఈ అమూల్యమైన విషయాలను మనకందించిన 
I-SERVE,Delhi Chapter  వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 
- పంతుల గోపాలకృష్ణా రావు)


మరింత సమాచారం తెలుసుకోండి: