బాలాపూర్ లడ్డూ.. దీనికున్న క్రేజే వేరు.. ప్రతి సంవత్సరం లడ్డు ఎంత ధరకైన  సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు భక్తులు. గత ఏడాది జరిగిన వేలంలో 16 లక్షలకు పైగా చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందంటున్నారు నిర్వాహకులు. వినాయక నిమజ్జనం సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. లడ్డు సొంతం చేసుకున్న వారికి అదృష్టం వరిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. లడ్డూ వేల పాట మొదలైన 17 సంవత్సరాలు స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు ఛాన్స్ కల్పించారు.

 

బాలాపూర్‌లో ప్రారంభమైన లడ్డూల వేలం నగరం మొత్తం వ్యాపించింది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాటను ప్రారంభమైంది. మొదట రూ. 450తో ప్రారంభమైన వేలం క్రమంగా వందలు..వేలు..లక్షలకు చేరింది. ఈ లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలు తలతూగుతాయని, పసిడి పంటలు పండుతాయని స్థానికుల విశ్వాసం. లడ్డూను దక్కించుకున్న వారు కూడా ఇదే చెబుతున్నారు.

 

అయితే బాలాపూర్ లడ్డూను తాపేశ్వరం హనీఫుడ్స్ తయారు చేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేష్‌డికి ఆ దుకాణ యజమాని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గణేష్ నవరాత్రులు ముగిసే వరకు నియమనిష్టలతో ఉంటారు. మద్యం, మాంసాలను ముట్టుకోరు. గణేషునితో పాటు లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు.

 

వినాయక చవితి ఫస్ట్ డే నుంచే పోటీ పడుతున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు నిర్వాహకులు. నిమజ్జనం రోజు ఉదయం 7 గంటలకు దరఖాస్తులు ముగిస్తారు. వేలం పాట రూ. 1116తో స్టార్ట్ అవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. లడ్డూ ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్స కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: