గుడ్లగూబలను కొందరు చాలా తెలివైనవిగా భావిస్తే, హిందూ సంప్రదాయంలో శుభ-అశుభాలకు సూచనగా చూస్తుంటారు. కానీ ఇవి  పర్యావరణం పరిశుభ్రంగా ఉండడానికి సాయపడతాయని చాల మందికి తెలియదు. గుడ్లగూబ వైభవ లక్ష్మి వాహనం అని, త్వరగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు... దీపావళి రాగానే అమావాస్య పూజల పేరుతో ఇప్పటికీ గుడ్లగూబలను బలి ఇస్తున్నారు. లక్ష్మీ పూజ రాత్రి గుడ్లగూబను బలి ఇవ్వడం వల్ల ఏడాది వరకూ వాళ్ల ధనధాన్యాలు, సుఖసంపదలు అలాగే ఉంటాయని కొందరు నమ్ముతారు.


ఈ సీజన్‌లో ఒక్కో గుడ్లగూబ రేటు 30 వేల వరకూ పలుకుతుంది. జైపూర్ లేదా మీరట్ నుంచి ఒక్కోదాన్ని మూడు లేదా నాలుగు వందలకే కొని దిల్లీలో 50 వేలకు అమ్ముతారు కొందరు. గుడ్లగూబల క్రయవిక్రయాల మార్కెట్ ఎక్కువగా రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లో వ్యాపించి ఉంది.ముఖ్యంగా జైపూర్, భరత్‌పూర్, అల్వర్, ఫతేపూర్ సిక్రీ దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. కోరాయీ-కరావ్లీ, మధుర దగ్గరున్న కోసీ-కలా లాంటి గ్రామాల్లో గుడ్లగూబల రహస్య వ్యాపారం భారీగా జరుగుతుంది.కొంతమంది గిరిజనులు, ముఖ్యంగా బహేలియా తెగవారు చిన్న చిన్న గుడ్లగూబలను పట్టుకుంటారు. దీపావళి సమయానికి భారీ ధరలకు అమ్ముకోడానికి వాటిని పెంచుతారు.


గుడ్లగూబల పరిమాణం బట్టి వాటి ధర ఉంటుంది. దాని కళ్ల నుంచి, మాంసం వరకూ ప్రతిభాగాన్నీ తాంత్రిక పూజల్లో ఉపయోగిస్తారు. అమావాస్య రాత్రి జరిగే తాంత్రిక పూజల్లో పాల్గొనేవారికి తాంత్రికులు కొన్ని ఆచారాలు పాటించాలని చెబుతారు. శారీరక సంబంధాలు పెట్టుకోకూడదని, శరీరంపై అవాంఛిత రోమాలు ఉండకూడదని, అర్థరాత్రి స్నానం చేయాలని చెబుతారు. తర్వాత ఒక తెల్లటి పంచె కట్టుకోవాలని, పై భాగం నగ్నంగా ఉండాలని చెబుతారు. ఆ తర్వాత కళ్లు మూసుకుని కూచోవాలంటారు. ఎదురుగా కూర్చున్న మంత్రగాడు మంత్రాలను చదువుతూ పూజలు చేయడం మొదలుపెడతాడు. ఇవి రకరకాలుగా ఉంటాయి. అప్పుడప్పుడు ఎవరైనా అమ్మాయిలు (అప్పుడే పిరియడ్స్ మొదలైన వారు) ఉపయోగించిన శానిటరీ న్యాప్‌కిన్‌ను గుడ్లగూబకు చుట్టి కాల్చేస్తారు. ఒక్కోసారి కొత్తగా పెళ్లైన మహిళ నెలసరి సమయంలో ఉపయోగించిన లోదుస్తులను చుట్టి తగలబెడతారు.


చిన్న పిల్లల మలంతో కూడా మంత్రగాళ్లు పూజలు చేస్తారు. ఇవి జరిగే సమయంలో గుడ్లగూబకు మద్యం తాగించి మత్తులో ఉంచుతారు. ఈ మంత్ర తంత్రాలు జరుగుతున్న సమయంలో ఆ చుట్టుపక్కలకు చిన్నపిల్లలు, మహిళలు రాకుండా చూసుకుంటారు. ఒకవేళ ఎవరైనా మహిళలు దానిని ఆసక్తిగా గమనిస్తే, ఆమె జీవితంలో పిల్లలు పుట్టరని, పిల్లలెవరైనా వాటిని చూస్తే చనిపోతారని భయపెడతారు. కానీ గుడ్లగూబలను ఇలా చంపేస్తున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా దాన్ని ఉపేక్షిస్తున్నాయి. వీటిని బలి ఇవ్వడం వల్ల సంపదలు రెట్టింపవడం నిజమే అయితే, వాటితో వ్యాపారం చేసేవారే కోటీశ్వరులు అయిపోయుండేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: