సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. రైతులకు పంటలు ఇంటికి రావటంతో కొంచెం తీరిక దొరికి సంబరంగా చేసుకునే పంటలకు సంబంధించిన ముఖ్యమైన పండుగ ఇది.
పల్లెటూర్లలో ఇప్పటికే సంక్రాంతి పండుగ హుషారు స్టార్ట్ అయింది. భోగి మంటల్లో చలికాచుకోవాలని, సంక్రాంతి సంభరాలు చేసుకోవాలని, కనుమతో పండుగకి ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటికే చాలా ప్లాన్స్ చేసేసుకునుంటారు. ఇక గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పాలి. అయితే రోజులు మారాయి.. రోజులతోపాటు తెలుగు సంప్రదాయాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తోందంటేనే జనవరి రెండు మూడు తారీకుల నుంచే సందళ్లు కనిపించేవి.
నేడు ఉద్యోగాలు, వ్యాపారాల్లో మునిగితేలుతున్న కారణంగా ఎవరూ ఈ పండుగను పూర్తిస్థాయిలో చేసుకోవడం లేదు. ఏదో మూడు రోజులకే పరిమితం చేస్తున్నారు. గతంలో అయితే, పండగకు పదిరోజుల ముందు నుంచే కొత్త అల్లుళ్ల హడావుడి మొదలై.. పండగ తర్వాత పదిరోజుల వరకు కూడా ఉండేది. నేడు అంత ఓపిక ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా తెలుగు సంప్రదాయాల్లో కీలకమైన సంక్రాంతి కుంచించుకుపోయి మూడు రోజులకే పరిమితమైంది.