తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. మరోవైపు గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.మకర సంక్రమణం జరిగింది కనుక దీ నిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు. మరియు నాలుగో రోజును ముక్కనుమ అంటారు.
సంక్రాంతి సంబరాల్లో కన్నెపిల్లలు ఎక్కువగా సంబరం జరుపుకునేది గొబ్బెలతోనే. వాకిళ్లలో రంగవల్లులు అద్ది.. వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి. వాటిని పూలలో అలంకరించి.. శ్రీ కృష్ణుని చుట్టూ చేరి గోపెమ్మలు ఆడినట్లు.. ఆ గొబ్బెమ్మల చుట్టూ చేరి కన్నెపిల్లలు ఆడటం సంక్రాంతి సంప్రదాయం. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. అలాగే గొబ్బెమ్మలతో పాటు తొమ్మిది రకాలకు చెందిన ధాన్యంను పోస్తారు. గొబ్బెమ్మకు గరక పోస, గడ్డి పువ్వు, పసుపు, కుంకుమలు పెట్టి అందంగా తయారు చేస్తారు.
ఇలా భోగి పండుగ నాడు ఇళ్ల ముందు వేసుకునే ముగ్గుల్లో గొబ్బెమ్మల చుట్టూ చేరి పాడలు పాడుతూ.. ప్రసాదాలు తీసుకోవడం ఒక సాంప్రదాయమైతే.. సంధి గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం కూడా ఆనవాయితీ. అయితే, నేడు ఈ సంప్రదాయం దాదాపు పోయింది. ఉదయం ఎవరి ఇళ్లలో వారు ముగ్గులు వేసుకుని గొబ్బి పూజ చేసుకుంటారు. సాయంత్రం సంధ్యాసమయం అయ్యే సరికి.. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా వెళ్లి జట్లు జట్లుగా ఏర్పడి చేతులు కలుపుతూ.. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ.. సంధి గొబ్బెమ్మల పూజ చేస్తారు. ఇది యువత ఆకాంక్షలకు నిలువుటద్దం.