సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోడిపందాలు ఎక్కువగా ఆడతారు. సంక్రాంతి కోసం ప్రత్యేకంగా ఈ కోళ్ళను పెంచుతారు. సుమారు ఆరు నెలల నుంచే ఈ కోళ్ళను పెంచే పనిలో ఉంటారు. మూడు నెలల ముందు నుంచే ఈ కోళ్ళ కోసం అడ్వాన్సులు ఇచ్చేస్తారు. ఒక్కో పందెంకోడి పెంపకానికి నెలకు దాదాపు పదివేలు ఖర్చు పెడతారు. అంటే దానికి బాగా జీడిపప్పు, బాదంపప్పు వంటి వగైరా లాంటి మంచి బలమైన ఆహారం పెడుతూ చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఈ విధంగా పెంచిన కోడి ధర ఎక్కువగానే పలుకుతుంది. వీటికోసం మూడు నెలల ముందునుంచే అడ్వాన్సులు ఇస్తారంటే దీని డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుంజులను పెంచడం, వాటిని పందాలకు సిద్ధం చేయడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
ఈ పందెం కోళ్ళ ధరలు ఏకంగా లక్షల్లో పలుకుతాయి. ఒక్కో కోడి లక్ష రూపాయల వరకూ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత ధరపెట్టి కొని పందాలు కాసే పందెంరాయుళ్ళు ఊళ్ళల్లో ఇప్పటికీ తక్కువేం లేవు. తీరా ఆ కోడి గెలిచాక వచ్చే లాభం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ మూడు నెలల ఆ కోడిని కొంత మంది ఇంట్లో పిల్లలకన్నా జాగ్రత్తగా చూసుకుంటారట అంత శ్రద్ధగా పెంచుతారు ఈ పందెం కోళ్ళను. చాలామంది అభ్యంతరాలు చెబుతున్నా, కోర్టులు ఆంక్షలు విధిస్తున్నా, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఈ పందేలు మాత్రం ఆగడం లేదు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు అనేక ప్రాంతాల్లో కోడిపందాల జోరు కొనసాగుతుంది. తమిళనాడులో జరిగే జల్లికట్టు మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కోడిపందేలకు చాలా ఖ్యాతి ఉంది. అయితే రానురాను అది మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.