ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ, మకర సంక్రమణం
ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. నెల రోజులపాటు జరుపుకునే పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!. కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న.ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది. తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు.వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగ రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బెమ్మ పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరెసెలు, చుక్కలు వంటి పిండి వంటలు నోరూరిస్తుంటాయి.  మకర సంక్రాంతి నాటికి పంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. ఇలా చేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి చివరికి మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

మకర సంక్రాంతి మరుసటి రోజును కనుమ అంటారు. ఈ రోజున రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు.


ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది నమ్మకం. అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ కలిసి కొద్దిగా కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి పొంగలిని చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి కాయను దిష్టి తీసి పగులకొడతారు. కనుమనాడు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను అలంకరించి పూజించటం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: