తెలుగింట తొలి పండుగ.. పెద్ద పండగ సంక్రాంతి. అన్నదాత ఇల్లు పంట దిగుబడులతో కళకళలాడే సమయం. పంట అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటిల్లీపాదికి కొత్త బట్టలు కొని.. ఆడ పడుచులను పుట్టింటికి పిలుచుకుని, పిండి వంటలతో సంబరంగా జరుపుకునే వేడుకిది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా రోజుకో విధంగా పండుగ సాగుతుంది. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి.
అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, హరిదాసులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు, హరిదాసులు ఇలా సంక్రాంతి సందడే వేరేగా ఉంటుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇంట్లోనూ పిండి వంటల ఘుమఘుమలే ఉంటాయి. ఈ సమయంలోనే సిటీల్లో ఉండేవారంతా పట్నం బాట పడతారు. దీంతో ప్రతీ ఒక్క ఇంట్లోనూ పిండివంటలు చేసుకుంటారు.
నేడు ఇంట్లో జరుగుతున్న భోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెవరు ఏయే పదార్ధాలు తింటారో.. ఎక్కడెక్కడ తింటారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సో.. సంక్రాంతినాడు మాత్రం అందరూ కలిసి కూర్చుని భోజనాలను అరటి ఆకుల్లోనే తీసుకోవాలి. అలాగే పూర్వం ఇంటికి అతిథులు వస్తే ముందుగా అరటి ఆకుల్లోనే విందు వడ్డించేవారు. ప్రస్తుతం కూడా వ్రతాలు, పూజలు నిర్వహించే విగ్రహ మూర్తుల వద్ద అరటి ఆకుల్లో ప్రసాదాన్ని పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అరటి ఆకులో భోజనం పెట్టడం ద్వారా అందులో ఉండే ఆక్సిజన్ వాయువు, ఇతర ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.