సంక్రాంతి అంటే మూడు రోజుల పాటు ఘనంగా జరిపే పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ ఈ మూడు రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంటుంది. ఈ మూడు రోజుల పండుగలో అనేక విశేషాలు ఉన్నాయి. సంక్రాంతి ప్రకృతి పండుగ. అదే సమయంలో పిల్లల పండగ, పెద్దల పండగ, పితృదేవతల పండగ.. ఇంకా చెప్పాలంటే.. పశుపక్ష్యాదులకు కూడా పండగే.. నేటి డిజిటల్ ప్రపంచంలో పండుగలంటే.. కొత్తబట్టలు.. ఓ విందు.. ఓ సినిమా.. అనే ధోరణి.. పెరిగిపోయింది. అసలు పండగల ప్రాధాన్యం, ప్రాశస్య్త్యం తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇక నేటి తరానికైతే అస్సలు పండగ విశిష్టత అనేది తెలియదు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించే క్రమంలో మకర రాశిలో ప్రవేశించే సందర్భమే "మకర సంక్రాంతిష. అని అంటారు. మకరసంక్రాంతి ప్రారంభం అవగానే వాతావరణంలో కొంచెం కొంచెంగా సంభవించే మార్పులు అందరం కూడా అనుభూతి చెందేదే. భోగి పండుగ రోజు ప్రజలు వేకువఝామునే నిద్దుర చాలించి తమ తమ ఇళ్ళల్లోని పాత కలప వస్తువులని మరియు తోటి వారి ఇళ్ళల్లోని నిరుపయోగంగా ఉన్న కలపని సంగ్రహించి వీధి కూడలిలో భోగి మంటను జ్వలింప చేసి పిల్లలతో పిడకల దండలు వేయించి శీతాకాలానికి స్వస్తి పలుకుతారు. సాయంకాలం పూట పసి పిల్లల శిరస్సులపై "బోగిపళ్ళు" కుమ్మరించి వారికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్ధిస్తారు.
భోగి పండగ మరుసటి దినమే ఈ "సంక్రాంతి" పండగ! ఈరోజు ముఖ్యముగా అందరూ నూతన వస్త్రాలని ధరిస్తారు. అలానే కొత్త కుండలో "తాజా పళ్ళు, కొత్త బియ్యం, కొత్త బెల్లం, తాజా కూరగాయల"తో పాయసం లేదా పొంగల్ తయారు చేసి సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు. మకర సంక్రాతి పండగలలో మూడోదైన రోజు "కనుమ"గా పండగ చేసుకొంటారు. ఈ కనుమ పండగ ముఖ్యముగా పశువుల కోసం జరుపుకుంటారు. మనుషులు పంటలు పండించుకోవటానికి, పండిన పంట ఇంటికి తెచ్చుకోవటానికి పశువుల సహకారం మరచిపోలేనిది.