ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన మహా జాతరగా పేరు పొందింది. గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రెండేళ్లకోసారి జరిగే మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. కొండాకోనా పరవశించేలా, జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర చాలా ఘనంగా జరుగుతోంది.
వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం ఇది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతల దర్శనానికి వెళ్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ములుగు సమీపంలోని గట్టమ్మతల్లిని భక్తులు దర్శించుకుంటున్నారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.
సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా మనదేశంలోనే వనదేవతులుగా సమ్మక్క-సారక్క లు పూజలందుకుంటున్నారు. ఇక ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. అలాగే ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.