మద్ది క్షేత్రం తెల్ల మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన చోటు మద్ది ఆంజనేయస్వామి దేవాలయం. మద్దిచెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులకీ భగవంతునికీ అవినాభావ సంబంధం వుంటుంది. కొందరు భక్తులు భగవంతునికి సేవచేసి తరిస్తే, భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు. ఆ రెండో కోవకి చెందిన భగవంతుడు, భక్తుడు, వారు వెలసిన క్షేత్రంగురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం ఊళ్ళో చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే మద్ది ఆంజనేయస్వామిగా వెలిసి దేశంలోనే ప్రముఖ హనుమద్‌ క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానం.

 

సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాల్లో ఉంటుంది. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడనీ అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. 

 

ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయస్వామి రాతి విగ్రహం కనిపించిందట. అలా క్రీ.శ.1166వ సంవత్సరంలో ఆ ఊరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు.  శిఖరము లేని గర్భాలయాలు చాలా అరుదు. కాని, ఇదే ఇక్కడి విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: