శివరాత్రి అంటే చాలా మంది ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి. రాత్రి జాగారం చేసి అత్యంత వైభవంగా నిష్టగా జరుపుకునే పండగ ఇది. ఆ పరమశివుని అనుగ్రహం కోసం ఎంతో మంది భక్తులు పరవశమై ఆయనను పూజిస్తుంటారు. అలాంటి భక్తుల్లో భక్తకన్నప్ప ఒకరు. ఆ పరమశివునికి ప్రసిద్ధి చెందిన భక్తులు మొత్తం 63 మంది ఉన్నారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. తరువాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్దిగాంచాడు. తిన్నడు ఓ బోయవాడే కాదు నాస్తికుడు కూడా. ఆయన అర్జునుడి అవతారం అని పూర్వికులు అంటుంటారు. ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం కఠోర తపస్సు ను చేసాడు. అర్జునుడి భక్తికి, మెచ్చిన శివుడు.. ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు.
దాంతో అర్జునుడి తపస్సుకి ఎలాగైనా భంగం కలిగించాలనే ఆలోచనతో ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల, ప్రయత్నానికి మెచ్చిన శివుడు.. అర్జునుడికి మహా శివుడిగా దర్శనమిచ్చాడు. దాంతో అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు.
అప్పుడు అర్జునుడు ముందుగా కోరుకున్నదేమిటంటే...పశుపతా అస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు.. దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని అర్జునుడికి సూచిస్తాడు. తరువాత ఆ ఆ అస్త్రం తిరిగి మహా శివుని వద్దకు చేరుతుంది. రెండోవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరతాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. ఎందుకంటే నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను. నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు. అందుకే ప్రసాదించలేను అంటూ సెలవిచ్చాడు. దాంతో నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు.
తిన్నడు శ్రీకాళహస్తి లోని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే.. దాన్ని వేటాడి, తినడానికి కాల్చుకున్నాడు. అతను కాళ్ళు కడుక్కొని.. ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు. ఇంతలో చేతిలో పందిని పట్టుకొని.. నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. చాలాకాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు.. తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలని భావిస్తాడు. దాంతో స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అనుకుంటూ...అటు పక్కగా ఉన్న సరస్సు దగ్గరికి వెళతాడు. చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగాన్ని శుభ్రం చేస్తాడు. నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోస్తాడు.పక్కనున్న పూలు, ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించి మరీ ఆ పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు.
ఇక ప్రతి రోజూ ఇలా జరుగుతూ ఉండేది. శివగోచర అనే ఓ బ్రాహ్మణుడు శివుడు మాంసం తిన్నాడని, శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని, శివలింగం మీదున్న పూలు కాలి చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకొని శివగోచర ఎంతో బాధడతాడు. ఆ బాధని భరించలేక ఏం చేయాలి అంటూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తలని తీసుకుని శివలింగానికి వేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే ‘అలా చేయకు. కాసేపు అలా పక్కన ఉండి చూడు అంటూ అక్కడి నుంచి చిన్న శబ్దం వినపడుతుంది. అది విని శివగోచర శివలింగం వెనుక దాక్కుంటాడు. కొంచెం సేపటికి.. తిన్నడు ప్రతిరోజు లాగానే అక్కడికి వస్తాడు. చేతిలో మాంసం, నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తరువాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు మాత్రం తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూస్తాడు. శివలింగం ఒక కంటిలో నుండి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన తిన్నుడు తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు.
తిరిగి రెండవ కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. దాంతో ఆయన రెండో కంటిని కూడా పీకడానికి సిద్ధపడతాడు కాని కంటిని పీకితే ఆ కన్ను ఎలా పెట్టాలో కనిపించదని ఆయన కాలుని ఆ కంటి వద్ద పెట్టి తన కంటిని పీకి పెట్టడానికి సిద్ధపడతాడు. అంత గొప్ప భక్తుడు తిన్నుడు. ఆ భక్తికి మెచ్చి శివుడు తన కంటిని తిరిగి ప్రసాదిస్తాడు. ఇదంతా చూస్తూ ఉన్న శివగోచర ఆయన భక్తికి పరవశించిపోతాడు. కన్నప్ప అన్నగా తన కంటిని వేరొకరికి ప్రసాదించిన వారు అని అర్ధమొస్తది.