పురాతన శివాలయాల్లో శివరాత్రి వేడుకలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కోవకు చెందిందే చిత్తూరు జిల్లా నగరి లోని చంద్రమౌళీశ్వర ఆలయం ఆకట్టుకుంటోంది. మహాశివరాత్రి రోజునే ఆదిదేవుడు లింగరూపంలో ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజునే శివుడు జన్మదినంగా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంగా పేర్కొంటారు. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 

                  

 

భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీళపట్టు త్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శివలింగం, నంది ఆకృతులు పలువురిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శతాబ్దాల కిందట నిర్మించినట్లు చెప్పుకునే ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుడు అష్టలక్ష్ములతో పూజలందుకున్నట్లు ప్రతీతి. 

 

 

 

ఈ ఆలయం వద్ద ఏటా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేపపడతారు. ఇవి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.  ఈ ఏడాది తాటాకులతో శివలింగాకృతిలో 54 అడుగుల ఎత్తైన ఆలయాన్ని నిర్మించారు. అలాగే 2000 శంఖులతో శివలింగం, నంది ఆకృతులను రూపొందించారు. వీటితోపాటు 45 అడుగుల ఎత్తుగల నవగ్రహ దోష నివారణ నందీశ్వరుని కూడా తయారుచేశారు.         

                                                            

 

 ఈ నందిని నవధాన్యాలతో అలంకరించడం మరో ప్రత్యేకతను సంతరించుకుంది . స్థానిక యువకుడు గణేశ్ రెండు నెలల పాటు శ్రమించి ఈ ప్రతిమలను రూపొందించాడు. తన్మయత్వానికి గురిచేసే తాటాకు శివలింగం, గగుర్పాటు తెప్పిస్తున్న గవ్వల శివలింగం, అబ్బురపరుస్తున్న నవధాన్య మహానందిని చూడటానికి భక్తులు ఎంతో ఉత్సాహంగా ఆలయానికి వస్తున్నారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: