ఏ శుభకార్యం జరిగినా.. ఏ మంచి పని ప్రారంభించాలన్నా ఆయన అనుగ్రహం లేనిదే ఏ పని చేయరు చాలా మంది. గణపతి పూజతోనే ఏపనినైనా మొదలు పెడతారు. ఆ విఘ్నేశ్వరుడిని తలుచుకుని ఏ పనినైనా మొదలుపెడితే అంతా విఘ్నాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే ఆశ్చర్చంగా ఉంది కదా. కానీ ఇది నిజం. ఆ మూడు తొండాల గణపతి దేవాలయ విశేషాలు ఏంటో అది ఎక్కడ ఉందో ఓ లుక్కేద్దాం...
మూడు తొండాలున్న గణపతి. అంటే త్రిసూంద్ గణపతి అని అంటారు. దీనిని చూడాలంటే మనం పూనేలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో స్థాపించారు. అయితే అప్పటి నుంచి ఇక్కడ ఈ త్రిసూంద్ గణపతి పూజలు అందుకుంటూనే ఉన్నారు. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే... గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. అందులో రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి అలాగే స్వామి నెమలి వాహనం పై ఆశీనుడై ఉంటాడట. ఇక ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ఈ ద్వార పాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయట.
అలాగే ఈ ఆలయంప్రాంగణమంతా కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు ఎంతో అలంకరణగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఏమిటేంటే.. ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో అయితే మరెక్కడా చూడలేము. ఇక మరో విడ్డూరం ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలను లాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఎందుకంటే ఆ రోజు మాత్రం అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు.