సాయిబాబాకు కుల మత అనే బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రార్ధిస్తుంటారు. సాయిబాబాను అందరు భక్తులు ఎంతో ప్రియంగా కొలుస్తుంటారు. సాయిబాబు కొలువు తీరిన షిరిడీలో ఎక్కువగా భక్తులు ఆయన్ను పూజిస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దేశం నలుమూలల నుంచి కొన్ని లక్షల మంది అక్కడకి చేరుకుని బాబాను దర్శించుకుంటారు. ఇక ఇదిలా ఉంటే... దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నామక్కల్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ అధినేత, ‘దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ’ బోర్డు చైర్మన్ కే. చంద్రమోహన్ తెలిపారు. అయితే అది ఈనెల 8న వెయ్యిశంఖాలతో అంగరంగ వైభవంగా మండలపూజ నిర్వహించనున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన వాళ్ళ యొక్క అనుభవాలు, అనుభూతులను మీడియాతో పంచుకున్నారు...
ఆయన మాటల్లో... ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. దాని తర్వాత అనుకోకుండా నాకొక కల వచ్చింది. ఆ కలలో ఒక పాప కనిపించి నాకు బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేపచెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి మరి లేచాను. వెంటనే నేను కలలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచ్చిరాపల్లి జిల్లా అక్కరపట్టి, సమయపురం, టోల్గేట్ సమీపంలో సరిగ్గా అదేస్థలం కనపడింది. ఆ స్థల యజమాని ఎవరో కాదు ఆయన ఒక రైతు. ఆలయ నిర్మాణం కోసం స్థలం అడగగా అందుకు ఆయన నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తరువాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు అర ఎకరా స్థలాన్ని కేటాయిస్తానని చెప్పాడు. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను అన్నారు. ఇక దాంతో అక్కడికి పెద్ద సంఖ్యలో భక్తుల రావడం అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి.
షిరిడీ పద్ధతుల్లో ఎలాగైతే బాబాకు హారతులు అందుతాయో అదే విధంగా ఇక్కడ కూడా ప్రవేశ పెట్టాను. ఇక దీన్ని ఇంకా పెద్ద ఆలయం నిర్మించాలని జర్మనీ నుంచి అత్యంత ఖరీదైన అలంకరణ రాళ్లను తెప్పించి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ ఆలయ నిర్మాణం పూర్తికాగా జనవరిలో కుంభాభిషేకం చేసి బాబాకు అంకింతం చేశాం. కుంభాభిషేకం ముగిసిన సందర్భంగా ఈనెల 8వ తేదీన వెయ్యి శంఖాలతో మండల పూజను చేపడుతున్నట్లు దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జ్ టి సురేష్ తెలిపారు. ఇక దీని దర్శనం కొరకు వచ్చే భక్తులు ఏవైనా సదుపాయాలు కావలసి వస్తే 9600005060 సెల్ఫోన్ నంబరులో సంప్రదించాలని సురేష్ తెలిపారు.