అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేల మాలిగిల్లో వెలకట్టలేని బంగారం బయట పడ్డాక ఆ స్వామి దేశంలోనే ధనవంతుడు అయిన స్వామి అయ్యారు. ఇంకా ఆ ఆలయంలో అంతు కట్టలేని సంపద ఉంది. ఇక మన తిరుమల తిరుపతి వెంకన్న సైతం అంతే ధనవంతుడు అయిన స్వామి అని.. ఆయనకు కూడా వెలకట్టలేని నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయని ఎప్పటి నుంచో భక్తులు చెప్పుకుంటుంటారు. ఇక పన్నెండవ శతాబ్దం నుంచే స్వామికి వెలకట్టలేని కానుకలు ఉన్నట్టు సమాచారం. ఇక మహంతుల శకం లో ఉన్న స్వామివారి ఆభరణాలు ఏమయ్యాయి ? అన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది.
మహంతుల గది కింద ఉన్న భూగర్భ రహస్య గదులు ఉన్నాయి అని అంటుంటారు. మఠం కింద ఉన్న సొరంగంలో ఏముంది అన్నది కూడా సస్పెన్సే. ఇక శ్రీకృష్ణ దేవరాయుల పాలనా కాలం నుంచి... బ్రిటీషర్ల పాలనా కాలం వరకు కూడా కొన్ని శతాబ్దాల నుంచి భక్తులు ఇచ్చిన బంగారం, ఇతరత్రా నగలు అన్ని కూడా హథీరాం మఠం కింద ఉన్న రహస్య గదుల్లోనే ఉన్నాయని చెపుతుంటారు. హథీరాం మఠం కింద నుంచి ఉన్న సొరంగం మార్గంలోనే రహస్య నేళమాలిగలు ఉన్నాయని... వాటిల్లోనే ఈ బంగారం ఉందని అంటుంటారు.
హథీరాం మఠం కింద 12 అడుగుల కిందకు దిగితే ఈ సొరంగ మార్గం ఉంటుంది. ఈ సొరంగ మార్గంకు వెళ్లే దారిలో ఉన్న గేటుకు వేసిన తాళం కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలియని పరిస్థితి. ఇక మహంతులు బస చేసే ప్రత్యేక గది కింద ఉన్న రహస్య గదుల్లో నేళమాలిగలు ఉన్నాయని కూడా చెపుతుంటారు. మహంతులు ఉండే మఠం నిర్మాణం దాదాపు 120 సంవత్సరాల క్రితం జరిగిందని అంటుంటారు. మరి అసలు వాస్తవ అవాస్తవాలు ఏంటో వీటిని అనంత పద్మనాభ స్వామి ఆలయాల వెలికి తీత తరహాలో బయటకు తీస్తేనే తెలుస్తాయి.