యుగానికి ఆది ఉగాది. ఇది చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే ఇది తెలుగువారి పండగ అయింది. ఉగాది వచ్చిందంటే చాలు.. తెలుగు ప్రజల లోగిళ్లు కళకళలాడుతుంటాయి. మామిడాకుల తోరణాలతో దర్శనమిస్తుంటాయి. ఉగాది పండుగ చైత్ర మాసం , శుక్లపక్షం లో పాడ్యమి రోజు జరుపుకుంటాము. చైత్ర మాసం తెలగు మాసాలలో మొదటిది. అలాగే మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ, పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది.
అంతేకాకుండా ఉగాది రోజునే బ్రహ్మసమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారంతో సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ రోజే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే. ఇలా ఉగాది గురించి ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి. ఇక ఉగాది రోజు చేయాల్సిన ప్రత్యేక స్నానం గురించి చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. నీటిలో గంగాదేవి, తైలం(నూనె)లో లక్ష్మీదేవి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఉగాది రోజున ఉదయాన్నే నువ్వుల తైలాన్ని శరీరానికి పట్టించి నాలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ రోజున ఇలా స్నానం చేయడం మాత్రం మరువకండి. అలాగే ఉగాది పండక్కి మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. ఇక తెలుగు ప్రజలందరికీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు.