శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పధ్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు.
ఇక ఇదిలా ఉంటే చాలా మంది మన పూర్వీకులు శ్రీరాముడి కంటే కూడా ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని చెబుతుంటారు. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని నమ్ముతారు. అందుకు కారణం లేకపోలేదు. అదేమిటంటే... శ్రీరాముడు లంక కు వెళ్ళటానికి రామ సేతువు నిర్మాణం జరుగుతోంది. ఇక వానరులు సముద్రంలో రాళ్లు వేస్తున్నారు. అవి నీళ్ళల్లో తేలుతూ పైకి వస్తుంటాయి. . ఇదంతా చూస్తూ ఉన్న శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్రంలో రాయిని వేశాడు. కానీ విచిత్రమేమిటంటే ఆ రాయి మునిగి పోయింది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయింది. దాంతో ఇలా జరిగిందేంటా అంటూ ఆయన ఇదేంటని శ్రీరాముడు హనుమను మరి కొందరిని అడిగాడు.
దాంతో వాళ్ళు ఈ విధంగా సెలవిచ్చారు. స్వామి! మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం. మీరు రాయలేదు కదా అన్నారు. అదేంటి. నేను స్వయంగా వేస్తున్నాను కదా. నా నామం రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవటం ఏమిటి? అని ఆయన ప్రశ్నిస్తారు. నా కంటే నామానికి అంత విలువా అంటూ... అందుకు హనుమ ఇలా తెలిపారు...స్వామి! మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. కదా అదే జరుగుతోంది స్వామి కాని మేము మీ నామాన్ని జపిస్తూ వదలడం వల్ల మీ నామ శక్తితో అవి పైకి వస్తున్నాయంటూ సెలవిచ్చారు.