నేడు శ్రీరామనవమి. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ రామ నవమిగా పూజలు జరుపుకుంటుంటాం. మరియు రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు. నాటి రోజే శ్రీసీతారాముల కళ్యాణం కూడా జరిగింది. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా ప్రజలు ఉత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకుంతుంటారు. ముఖ్యంగా ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సావం ఎంత ఘనంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే కరోనా ప్రభావంతో భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది. రామయ్య పెండ్లి కూడా కరోనా ఆటంకం ఏర్పడింది. వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక సూచనలు చేసింది. భక్తులు రాకుండా కేవలం అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఒకరిద్దరు ఆలయ ధర్మకర్తల సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి కారణంగా దేవాలయాల్లోని అన్ని కైంకర్యాల మాదిరిగానే రాములోరి కళ్యాణాన్ని కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని భద్రాద్రి ఆలయ అధికారులు ప్రకటించారు.
భక్తులెవరూ భద్రాద్రికి రావొద్దని కోరారు. ఈసారి టీవీల్లోనే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు. అయితే దేవస్థానం చరిత్రలో తొలిసారి రామయ్య కళ్యాణాన్ని ఆలయంలోని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహించనున్నారు. రామాలయం నిర్మాణం చేపట్టిన 350 ఏళ్లలో భక్తుల భాగస్వామ్యం లేకుండా ఏనాడు ఈ విధంగా కళ్యాణం జరగలేదని ఆధ్యాత్మికవేత్తలు వెల్లడించారు. కాగా, శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భద్రచలంకు చేరుకున్నారు.