హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు ప్రముఖం. తన యొక్క భక్తిప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. అతిబలవంతుడు, రామభక్తుడు, చిరంజీవి, హనుమంతుడు ఇలా ఆంజనేయస్వామిని అనేక పేర్లతో కొలుస్తారు. అయితే చాలా మందికి శ్వేతార్క ఆంజనేయ స్వామి గురించి తెలియకపోవచ్చు. తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. ఇలా తెల్లజిల్లేడు వేరుపై ఆంజనేయుని రూపును తయారు చేయించి, సిందూరంతో అలంకరించి, పూజ మందిరంలో ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. ఇంతకీ శ్వేతార్క ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటి అన్న సందేహం రావచ్చు. జాతకరీత్యా ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తాయి.
బాలారిష్టాల కారణంగా పిల్లలు తరచు ఆరోగ్య సమస్యలకు, ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. లేనిపోని భయాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి దోషాలను నివారించడానికి శ్వేతార్క హనుమాన్ ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు.