రంజాన్ ముస్లింల పెద్ద పండుగ. ఈ పండుగకు ఎంతో భక్తి శద్ధలతో ఉపవాస దీక్షను చేస్తారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉపవాస దీక్షను ఆచరిస్తారు. నెల రోజుల పాటు ఎంతో కఠినంగా ఉండే ఉపవాసమిది. ఇక `పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని తెలియజేస్తుంది.
తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన క్యాలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ ' రంజాన్ మాసం`.
ఇక రంజాన్ నెల మొత్తం ఎంతో నిష్టగా ఉండే ఈ ఉపవాస దీక్షతో రోజంతా కనీసం మంచి నీరు కూడా తాగకుండా ఎంతో కఠినంగా ఉంటారు. ఇక సాయంత్రం ఖర్జూరపండుతో ఉపవాస దీక్షను తీస్తారు. ఆ తరువాతే మంచి నీరైనా ఏదైనా సరే తీసుకుంటారు. అయితే దీనికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. పూర్వం మహ్మద్ ప్రవక్త రోజంతా ఉపవాసముండి ఇఫ్తార్ సమయానికి ఇక అక్కడ ఎక్కువగా పండే ఖర్జూరపండును ముందుగా తిని ఉపవాస దీక్షను విరమించేవారు.
దాంతో ముస్లిం సోదరులందరూ కూడా మహ్మద్ ప్రవక్త ఏదైతే చేసేవారో అదే విధంగా ఆయన అడుగుజాడలను పాటిస్తూ ప్రతి ముస్లిం ఉపవాస దీక్షను ఖర్జూర పండుతోనే తీస్తారు. అంతేకాక ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం నుంచి నీరు కూడా తగలని శరీరానికి ఈ పండు తినగానే కాస్త శక్తి అందుతుంది. ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మికంగానూ ఇది చాలా మంచిదని మతపెద్దలు చెబుతుంటారు.