ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలు భక్తుల కోసం తెరుచుకుంటున్నాయి. కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రం కూడా పాటిస్తుండటంతో దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. అయితే మొదటి రోజు కేవలం ఆలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక విజయవాడ కనకదుర్గ అమ్మావారి ఆలయం ఈనెల 10 నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం అవకాశాన్ని కల్పిస్తోంది.

 

 

అమ్మవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేశారు. గంటకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దయచేసి భక్తులందరూ సహకరించాలని ఆలయ సిబ్బంంది కోరారు. భక్తులు మాస్కులు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌ ఉంటేనే ఆలయాల్లోకి అనుమతిస్తారు. కంటైన్‌మెంట్‌ జోన్లలోని ఆలయాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోకి 10వ తేదీ నుంచి భక్తులను అనుమతిస్తారు.

 

 

భక్తులు జాగ్రత్తలు పాటించాలని, కచ్చితంగా ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం కల్పించనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శన ట్రయల్‌ రన్‌ను ప్రారంభించారు.

 

 

ఆలయ సిబ్బందితో నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ వచ్చి రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేని పరిస్థితుల్లో కూడా జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా మిగతా నాలుగు సంవత్సరాలపాలన కూడా సుభిష్టంగా ఉంటుందంటున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించినా తొనకకుండా.. బెనకకుండా కరోనా కష్టకాలంలో అన్ని వర్గాలకు సీఎం సాయం అందించారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: