పతివ్రత.. అంటే పతియే దైవంగా భావించే భార్య. అంటే భర్త తప్ప పర పురుషులను ఎరుగని భార్య. సాధారణంగా భర్త అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్క పురుషునితోనే సంసార బంధం ఉన్న స్త్రీని పతివ్రత అంటారు. అయితే మహాభారతంలోని పాండవుల ఉమ్మడి భార్య ద్రౌపది కూడా పతివ్రతే అని చెబుతారు.

 

 

మరి ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రతా ఎలా అయిందన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే.. ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించింది. అంటే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాడు.

 

 

అలాగే ఈ పంచపాండవులు, ద్రౌపది... నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే. ద్రౌపది యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. ధర్మరాజాదులు కుంతి, మాద్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే. లా జన్మించడానికి కూడా ఓ కారణం ఉంది.

 

 

త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని ’ ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. ‘మహేంద్రా.. ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది. కనుక తపస్సు చెయ్యి. అయితే.. బ్రహ్మహత్య దోషంతో ఉన్న నీకు, ప్రస్తుతం దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు.

 

 

అందుకే నీ పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నీకు నమ్మకమైన మిత్రుల దగ్గర దాచివుంచి, ఒక ప్రాణశక్తిని నీదగ్గర ఉంచుకుని తపస్సు చేసి బ్రహ్మహత్యపాతక పరిహారం చేసుకో’ అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యమడు, వాయువు, అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు ప్రారింభించాడు.

 

 

పాండురాజు భార్యలైన కుంతి, మాద్రులు దుర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..నకుల, సహదేవులు జన్మించారు.

 

 

ఇంద్రుడు బ్రహ్మహత్యపాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్తతిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞ కుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో అంటే ఒకే భర్త అయిన ఇంద్రునితో.. ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ‘ద్రౌపది ’ అంటే శచీదేవి పతివ్రతే కదా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: