పూర్వం హిరణ్యకశిపుని వంశాన నికుంభుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతనికి సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు కొడుకులు. వీరిరువురూ ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే... లోకం వారిద్దరినీ కలిపి ‘సుందోపసుందులు’ అని ఒకే పేరుతో వ్యవహరించేది. వీరిద్దరి మనసులో ఒకే కోరిక మొదలైంది. ఈ ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్నదే ఆ కోరిక! అందుకోసం వారు వింధ్యాచలానికి వెళ్లి ఘోర తపస్సుని మొదలుపెట్టారు.



వారి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రాది దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి వారి కోరికలను మన్నించేందుకు బ్రహ్మ ప్రత్యక్షం కాక తప్పలేదు.బ్రహ్మను చూసిన సుందోపసుందులు ముకుళిత హస్తాలతో ఆయనను ప్రార్థించారు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ! ‘మాకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోవాలి. ఏ మాయ చేయాలంటే ఆ మాయను చేయగలగాలి. కానీ చావు మాత్రం అన్యుల చేతుల్లో ఉండకూడదు’ అని టకటకా వరాలను కోరుకున్నారు సుందోపసుందులు. వారి వరాలకి బ్రహ్మ తథాస్తు చెప్పడంతో సుందోపసుందుల తపస్సు ఆగింది కానీ, లోకులకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి.


సుందోపసుందుల అకృత్యాలకు దేవతలు, మానవులు, రుషులు, కింపురుషులు హడలిపోయారు. యజ్ఞయాగాలు స్తంభించిపోయాయి. ఇక దిక్కుతోచని ముల్లోకాల వాసులంతా మళ్లీ బ్రహ్మ చెంతకు చేరారు. ‘అన్యులు (ఇతరులు) చేతుల్లో వారికి మరణం ఉండదని వరమిచ్చిన మాట నిజమే! అంటే వారిలో వారు కొట్టుకు చచ్చే అవకాశం ఉందనేగా’ అన్నాడు బ్రహ్మ చిరునవ్వుతో. అందుకోసం ముల్లోకాలలోనూ ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు .


సుందోపసుందులు ఉండే ప్రాంతాన్ని చేరింది తిలోత్తమ. తమ కళ్ల ముందు తిలోత్తమ కనిపించగానే సుందోపసుందులకు మతులు పోయాయి. ఆమె నాదంటే నాదని ఆశపడ్డారు. ‘మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో మీరే తేల్చుకోండి,’ అంటూ వారిని మరింతగా ఉసిగొల్పింది తిలోత్తమ. ఇంకేం! ముష్టిఘాతాలతో, గదాయుద్ధాలతో ఒకరి మీద ఒకరు కలియబడ్డారు సుందోపసుందులు. ఇద్దరూ సరిసమానులే. ఇద్దరూ అపరపరాక్రమవంతులే. ఇద్దరూ వరసంపన్నులే! అందుకని ఇద్దరికీ ఓటమే మిగిలింది. ఇద్దరికీ చావే దక్కింది. మోహం అనే బలహీనత ఎంతటి అన్యోన్య బంధాన్నైనా దెబ్బతీస్తాయన్నది సుందోపసుందుల కథ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: