ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం.. మనం కళ్లకు అద్దుకుని తినడం మామూలే. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు.. ప్రసాదం ఎందుకు తినాలి.. అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి.. ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

మనం ప్రసాదం అని వాడుకలో వాడే పదానికి అన్నం, నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి. కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం. ఇక మన శాస్త్రాల్లోకి వెళ్తే..  హృదయానికి సంతోషం కలిగించేదాన్ని ‘ప్రసాదకం’ అని అంటారు. మనం రోజూ ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా.. ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. 

ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది. మనిషిలోని కరుణను పెంచుతుంది. ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలాగే అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్పదని చెబుతారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. 

ఇక సాధారణంగా ఆలయాల్లో అన్నంతో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది. ఇంకా ప్రసాదంలో వాడే  పెసరపప్పు, కొబ్బరిముక్కలు వంటి పదార్ధాలతో ప్రసాదం ఎంతో బలాన్నిస్తుంది. 

అందుకే భక్తికి భక్తి, శక్తికి శక్తి, త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ విస్మరించకూడదు. మనసును కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్నివదులుకోకూడదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: