సాధారణంగా దైవారాధన సమయంలో దీపారాధనకు వివిధ రకాల నూనెలను వినియోగిస్తుంటారు. కొందరు మంచి నూనెను ఉపయోగిస్తే.. మరికొందరు కొబ్బరి నూనెను వాడుతారు. మరికొందరు నెయ్యితో కూడా దీపారాధన చేస్తుంటారు. అయితే, మంచి నూనె, నెయ్యితో చేసే దీపారాధన కంటే కొబ్బరి నూనెతో దీపారాధన వల్ల మంచి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని చెపుతున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మికి 40 రోజుల పాటు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మొండి బకాయిలు కూడా వసూలవుతాయట. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుందని చెపుతున్నారు. పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని చెపుతున్నారు. ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావట. కాశీలోని విశ్వేశ్వరస్వామికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయట. హరిద్వార్‌లో సాయం సంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: