శాఖ మాస శుక్ల పక్ష తదియను అక్షయ తృతీయగా పేర్కొంటారు. ఈ రోజును దానాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సూర్య చంద్రులు శక్తివంతంగా ఉండే ఈ రోజు దాన ధర్మాలకు, పుణ్య కార్యాలకు చాలా ముఖ్యమైంది. వేదాల్లో మాత్రం బంగారం, నగలు కొనుగోలు చేయాలని చెప్పలేదట. దురహంకారపరులైన క్షత్రవకుల సర్వస్వాన్ని సంహరించడానికి శ్రీమాహావిష్ణువు ... రేణుక, జమదగ్ని దంపతులకు పరశురామునిగా జన్మించినదీ ఈ "అక్షయతదియ''నాడే. అందుకే ఈ రోజుకు ఇంతటి ప్రత్యేకత.
"యః కరోతి త్రుతీయామాం కృష్ణం చందన భూషితం
వైశాఖస్యసితే పక్షే సయాత్యచ్యుత మందిరమ్''
శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ శుక్ల తృతీయ యందు శ్రీకృష్ణునికి చందనామ లేపనం చేసిన భక్తులకు విష్ణుసాలోక్యం కలుగుతుందని ధర్మసింధువు చెప్తుంది. ఈ అక్షయ తదియనాడు జప, హోమ, తర్పణాలతో పితృదేవతలను ఆరాధిస్తే ... వారికి అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. భీష్మ ఏకాదశినాడు ఎలాగైతే తర్పణాలు ఇస్తామో ... ఈ అక్షయతదియనాడు పరశురామునికి అర్ఘ్యప్రధానం చేయాలి.
"జామదగ్న్య మహావీర క్షత్రియాంతకర ప్రభో
గృహాణార్ఘ్యం మయాదత్తం కృపయా పరమేశ్వర''
క్షత్రియులను అంతము చేసిన మహావీరుడవైన పరశురామా! పరమేశ్వరా! నేనిస్తున్న అర్ఘ్యమును దయతో స్వీకరించు'' అని భక్తిగా జలాంజలు సమర్పించాలి. శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఆరోది పరశురాముడు. వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం పేర్కొంటున్నాయి. పరశురాముడి జననం, పవిత్ర గంగ దివి నుంచి భువికి చేరడం, త్రేతాయుగం ఆరంభం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలుని కలుసుకొన్న దినం, వ్యాస మహర్షి మహా భారతాన్ని వినాయకుని సాయంతో రాయడం ఆరంభించిన సుదినం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు “అక్షయ పాత్ర” ఇచ్చిన పవిత్రమైన రోజు అందుకే ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు.