వినాయక చవితి వచ్చిందీ అంటే చాలు చిన్నా పెద్ద అనే తార తమ్యం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా వినాయకుడి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రక రకాల పిండి వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఇక వినాయక పూజ వచ్చిందంటే చాలు స్వీటు షాపులు కల కలలాడుతాయి. ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలకు బాగా డిమాండ్ పెరిగిపోతుంది. పండుగకు ముందే వినాయకుడి విగ్రహాలతో పాటు లడ్డూలను బుక్ చేసుకుంటున్నారు జనం.
వినాయక చవితి ఉత్సవాలు సిటీలో 11 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. మొదటి రోజు లడ్డూ, కుడుములు నైవేద్యంగా పెడతారు. ఇంకొందరు 11 రోజుల్లో ఏదో ఒకరోజు తప్పకుండా లడ్డూ నివేదిస్తుంటారు. దీంతో సిటీలో లడ్డూలకు గిరాకీ పెరిగింది. అయితే ఈ సమయంలో లడ్డూలకు డిమాండ్ తో రేట్లు కూడా బాగా పెరిగిపోతాయి.
వెరైటీని బట్టి కేజీ లడ్డూ రూ. 200 నుంచి రూ. 1500 వందల వరకు ఉన్నాయి. లడ్డూకి మంచి గిరాకీ ఉందని..కస్టమర్లు ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారని చెప్తున్నారు వ్యాపారులు. వినాయకుడికి ప్రసాదంగా పెట్టేందుకు 5 కేజీల నుంచి 25 కేజీల వరకు ఆర్డర్లు చేస్తుంటారు. ఇక పండుగకు వారం పదిరోజుల ముందు నుంచే లడ్డూ తయారు చేయడంలో నిగ్నమవుతారు వ్యాపారస్తులు. పండగ దగ్గరపడుతున్న కొద్దీ స్వీట్ షాపులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి.