ఆదిదేవుడిగా కొలిచే గణపయ్య జన్మదిన పండుగ అంటే అందరికి సంబరమే. నవరాత్రి ఉత్సవాలంటే ఎక్కడలేని ఆనందం. గ్రామగ్రామాన, వాడవాడలా తోమ్మది రోజుల పాటు సందడి కనిపిస్తుంది. గత కొంత కాలంగా వినాయక భారీ విగ్రహాలు, రంగులతో పర్యావరణం కాలుష్యం అవుతుందని ప్రభుత్వం ఎన్ని కండీషన్లు పెడుతున్నా విగ్రహాల విషయాల్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు భక్తులు. పర్యావరణ ప్రేమికులు పీఓపీ విగ్రహాలు వద్దు మట్టి వినాయకులనే ప్రతిష్ఠిద్దామని చెప్పుతున్నా, ఎవరు పట్టించుకోవడం లేదు. మట్టి వినాయకుల తయారీదారులను ప్రోత్సహించి వారికి ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు.
ప్రతి సంవత్సరం సమారు 300 వరకు గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. వీటన్నిటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కళాకారులు వలుస వచ్చి పీఓపీ రసాయణ మిశ్రమాలతో విగ్రాహాలను తయారు చేసి ఆమ్మకాలు చేస్తున్నారు. విగ్రహాల తయారీకి ఉపయోగించే పీఓపీతో జలచరాలకు, వణ్యప్రాణులకు, ప్రజలకు ప్రాణహాని పొంచి ఉంది. ప్రజలు పర్యావరణానికి హానీ చేయకుండా ఉండాలంటే పీఓపీ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి.
ఆదిశగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులతో పాటు ప్రజలపై కూడా ఉంది. మట్టి విగ్రహాలను తయారు చేసే కళాకారులకు సరైన ప్రోత్సాహం కల్పించక పోవడంతో మట్టి విగ్రహాల తయారీ మరుగున పడిపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మట్టి విగ్రహాల తయారీ కళాకారులను ప్రోత్సహించి, మట్టి విగ్రహాల తయారీకి, విక్రయానికి తగు ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.