భారతీయులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్న పండుగ దీపావళి. ఈ దీపావళి 3 రోజుల పండగ అభివర్ణిస్తారు.. ఆశ్వయుజ త్రయోదశినుండి మొదలుకొని ఆశ్వయుజ అమావాస్యవరకూ.
ఈమూడు రోజులలో ఏం చెయ్యాలి?
త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలలో మూడు రోజులలోనూ సాయంత్రం తొలి నక్షత్రం కనబడే వేళకు పూజగదిలోనూ, తులసికోట వద్ద, ఇంటి గుమ్మాలవద్ద దీపాలనువెలిగించాలి.
రెండవరోజు నరకచతుర్దశి నాడు :
సూర్యోదయానికిముందే అభ్యంగనస్నానం, (అంటే తలనుంచి పాదాలవరకూ నువ్వులనూనె పట్టించుకుని ఆపైన నలుగుపిండితో రుద్దుకుని కుంకుడు కాయలు/షికాకాయ పొడితో తలంటు స్నానం చేయటానికి అభ్యంగనస్నానం అని పేరు)
*యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ,
వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ.
ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమాత్మనే.*
అని యమనామములను పఠించి తర్పణములనీయాలి. దీనివలన అకాల మృత్యుదోషములు తొలగి పోతాయి. ఉల్కాదానం (గోగుకొమ్మ లేక ఆముదపు కొమ్మ కు నూనెలో తడిపిన నూలు వస్త్రంలో నల్లనువ్వుల ను చిన్న చిన్న మూటలుగా కట్టి వెలిగించి ఉత్తరం నుంచి దక్షిణంవైపు పడవేయటం.)దీనికే దివిటీలను వెలిగించటమని పేరు.
సంధ్యాదీపాన్ని వెలిగించవలె :
ఈ విధులవల్ల మనపితరులు జ్యోతిరాది మార్గంలో బ్రహ్మ లోకానికి చేరుకుంటారని ధర్మశాస్త్రం. మానవులకు నరకబాధ ఉండదు కనుక దానికి నరకచతుర్దశి అని పేరు. మూడవ రోజున సాయంకాలం ధనలక్ష్మీ పూజను చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి. ఈదీపములవరుసలతో అలంకరించకుంటాము కనుక ఈరోజు ను దీపావళి అంటారు. ఇలా ఈమూడు రోజుల పండగ వల్ల మనపితరులకు ఉత్తమలోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట. అలాగే సత్యభామాదేవి నరకుని సంహరించినరోజు నరకచతుర్దశి అని, ఆఆనందపు పండగే దీపావళి అని అందుకే మనం బాణసంచా వెలిగిస్తామని అనాదిగా వస్తున్న సంప్రదాయం.