క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు జన్మదినం అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఓ గొడ్ల చావిడిలో జన్మించిన విషయామూ తెలుసు. రోము సామ్రాజ్యాన్ని సీజరు పరిపాలిస్తున్న రోజుల్లో యేసు జన్మించాడు. దేశప్రజలంతా జనాభా లెక్కల నిమిత్తం తమ స్వస్థలాలకు రావాలని సీజర్ ఆజ్ఞాపించాడు.
క్రీస్తు తల్లిదండ్రులైన యేసేపు, మరియ.. తమ స్వస్థలం - బెత్లహేము పయనమయ్యారు. ఆ సమయంలో మరియ నిండుచూలాలు. ప్రసవ సమయం ఆసన్నమైంది. అందుకే బెత్లహేములోని ఒక సత్రంలో ఆ రాత్రి తలదాచుకున్నారు. ఆ సత్రం యాత్రికులతో కిక్కిరిసి ఉండటం వల్ల వారికి పశువుల పాకే ఆశ్రయం ఇచ్చింది.
పశువుల పాకలోని ఓ తొట్టె అప్పుడే పుట్టిన యేసును పడుకోబెట్టారు. ఏసు జన్మ వృత్తాంతంలోనే ఓ అద్భుతమైన సందేశం కూడా ఉంది. ఎలాగంటే.. మానవ హృదయం ఒక నివాస స్థలం. అది పశువుల పాకలా అపరిశుభ్ర వాతావరణంలో ఉంది.
క్రీస్తు తాను జన్మించే చోటును అక్కడే వెతుక్కున్నాడు. అంటే మానవ హృదయాల్ని శుద్ధపరచి మహోన్నతులుగా చేసేందుకే ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు నరావతారంలో ఈ లోకంలోకి వచ్చాడు. అంటే సంపూర్ణ మానవత్వమే దివ్యత్వానికి దారి చూపుతుందని తన సేవ, కరుణ, ప్రేమలతో లోకానికి ఆయన చెప్పకనే చెప్పాడన్నమాట.