మహాశివరాత్రి.. హిందువులకు పరమ పవిత్రమైన రోజు.. ఈ రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు. జాగారం చేస్తారు.. అయితే అసలు శివతత్వం గురించి తెలుసుకోకుండా.. కేవలం పూజలు, ఉపవాసాలు చేస్తే ఏం ఫలితం ఉంటుంది. శివుడి భావన అర్థం చేసుకోకుండా జాగారం చేస్తే ప్రయోజనమేంటి..?
శంకర భగవత్పాదులవారు శివ మానస పూజా స్తోత్రంలో ఇలా చెప్పారు.. ‘ఆత్మా త్వం గిరిజామతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా, నిద్రా సమాధి స్థితిః, సంచారః పదయోః ప్రదక్షిణవిధిః, స్తోత్రాణి సర్వాగిరౌ, యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్’ అన్నారు.
అంటే.. ‘స్వామీ! నా ఆత్మయే నీవు నా బుద్ధియే అమ్మవారు నాప్రాణాలే నీ సహచరులు, నా శరీరమే నీ గృహము, నా కార్యక్రమాలే నీకు చేసే పూజలు, నా నడకే నీకు చేసే ప్రదక్షిణ, నా మాటలన్నీ నీ స్తోత్రాలే అంతెందుకు నేను చేసే పనులన్నీ నీ ఆరాధనే’ అంటూ జీవునికీ దేవునికీ అద్వైతాన్ని బోధించారు.
శివపార్వతులిద్దరిదీ ఏకరూపమే. మనం అర్ధనారీశ్వర తత్వంలో తెలుసుకోవలసిన విషయం కూడా ఇదే. ప్రకృతి పురుషుల సమన్వయ స్వరూపమే సృష్టికి మూలం. శివం అంటేనే మంగళమని అర్థం. శివపార్వతులు తత్త్వాన్ని తెలిపే అనేక పురాణాలు.. శంకరుడి సర్వంసహ మూర్తిమత్వాన్ని ఆయన తత్వస్వరూపాన్ని విపులంగా చెప్పాయి. ఇదీ శివతత్వం.