తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలిలో ఎంత మంది దేవుళ్లు ఉన్నారో తెలుసా...!

 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైన ద్వారం బంగారు వాకిలి. పచ్చని పసిడి కాంతులతో మెరుస్తూ ఉనన ఈ బంగారు వాకిలి నుండే నేరుగా శ్రీ స్వామి వారి దర్శనం భక్తావళికి లభిస్తున్నది.

 

 సాక్షాత్తు శ్రీ మహావైకుంఠంలో జయవిజయులు కాపలా కాస్తున్న బంగారు వాకిళ్లే భూలోక వైకుంఠమని ప్రసిద్ధి చెందిన వేంకటాచలంలోని ఈ  బంగారు వాకిళ్ళు అన్న ప్రశక్తిని పొందిన ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రాహ్మ ముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీనకాలం నుంచి కొనసాగుతూ, అత్యంత విశిష్టతను సంతరించుకుంది. 

 

బంగారు వాకిలి ప్రవేశమార్గంలో గల 6అడుగుల వెడల్పు గల చెక్కడపు రాతి ద్వార బంధానికి రెండు పెద్ద చెక్కవాకిళ్లు బిగింపబడ్డాయి. ఈ రాతిద్వార బంధానికి, వాకిళ్లకు, పక్కన జయ, విజయుల కటాంజన మందిరాలకు కలిపి బంగారు పూతరేకు తాపబడింది. అందువల్లే దీనికి బంగారు వాకిలి అనే సార్థక నామధేయం అనాదిగా వ్యవహారంలో ఉన్నది. ఈ బంగారు వాకిలి ద్వార బంధానికి క్రిందా, పైనా, పక్కలా తీగలు, లతలు చెక్కబడ్డాయి. 

 

పై గడపకు మధ్యలో క్రిందివైపుగా విచ్చుకొన్న పద్మం, అలాగే పై గడపకు వెలుపలివైపు ఏనుగులచే అర్పింపబడుతున్న పద్మాసనస్థ అయిన శ్రీ మహాలక్ష్మి దేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి. 

 

ఇక ఈ ద్వార బంధానికి రెండు చెక్క వాకిళ్ళు బిగింపబడ్డాయి. రెండు వాకిళ్ళ మీద చెక్కదిమ్మెలతో చతురస్రాకారపు గళ్ళు ఏర్పాటు చేయబడి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణుశిల్పం మలచబడి ఉంది. ఈ రెండు వాకిళ్లు మూసి ఉంచినపుడు వరుసగా నాలుగు గదులు ఏర్పడతాయి. ఇలా వరుసకు నాలుగుగళ్ళ వంతున వాకిలి పై నుంచి కింది వరకు అటువంటి ఎనిమిది వరుసలు ఉన్నాయి. అంటే ఈ రెండు వాకిళ్ల మీద వెరసి 32 గళ్ళు ఉన్నాయన్నమాట. 

 

పై నుండి మొదటి వరుసలో ఉన్న నాలుగు గళ్ళలో, మొదటి గడిలో చక్రం, రెండవ దానిలో కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వేంకటేశ్వరుడు, ఇక మూడో గడిలో వైకుంఠవాసుడైన మహావిష్ణువు కూర్చొన్న భంగిమలోను, నాల్గవ గడిలో శంఖం చెక్కబడి ఉన్నాయి. రెండవ వరుసలో ఉన్న నాలుగు గళ్ళలో వరుసగా వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి. ఆగమ శాస్త్రానుసారంగా వీటిని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క వ్యూహ రూపాలుగా పేర్కొంటారు. 3,4,5వ వరుసల్లో గల 12 గళ్ళల్లో కేశవుడు మొదలుగా దామోదరుడు వరకు గల మూర్తులను ఈ క్రింది క్రమంలో నెలకొల్పారు.

 

3వ వరుస 1.కేశవుడు 2.నారాయణుడు  3.మాధవుడు   4.గోవిందుడు

4వ వరుస  1.విష్ణువు   2.మధుసూదనుడు 3.త్రివిక్రముడు 4.వామనుడు

5వ వరుస  1.శ్రీధరుడు 2.హృషీకేశుడు 3. పద్మనాభుడు, దామోదరుడు

 

విష్ణువు యొక్క ఈ ద్వాదశ రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉన్నాయి. ఇక చివరి మూడు వరుసల్లో అంటే 6,7వరుసల్లోని ఎనిమిది గడుల్లోను 8వ వరుసలోని ఒకటవ, నాలుగవ గడుల్లోను వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవమూర్తులైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. 8వ వరుసలోని రెండవ, మూడవ గడుల్లో తలుపులు చేయటానికి వీలుగా చిలుకులు (గొలుసులు) బిగింపబడ్డాయి. 

 

ఈ ఇసుప గొలుసులను క్రింది గడపకు గల ఇనుప కొక్కికి తగిలించి పెద్దతాళం వేస్తారు. ఇదికాకుండా ఈ వాకిళ్లకు మధ్య భాగంలో మూడుచోట్ల మూడు గడియలున్నాయి. ఈ మూడు గడియల్లో, పై దానికి కిందిదానికి దేవస్థానం వారి పెద్ద తాళాలను వేస్తారు.

 

మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి, తాళం చెవులను తమ వెంట తీసుకొని వెళతారు. ఇంతే కాకుండా ఈ వాకిళ్ళకు గల చిన్న రంధ్రం ద్వారా వెలుపలి నుండే అర్చకులు, కొడవలి వలె వంకరగా ఉండే కడ్డీ అనబడే పరికరంతో వాకిళ్లకు లోపలి వైపున ఉన్న గడియను వేస్తారు. అలాగే బయటి నుండే బంగారువాకిలికి లోపలివైపు గడియను తీస్తారు. ఇలాబయటి నుండే లోపలిగడివేయటం, తీయటం వంశపారపర్యంగా అర్చక స్వాములకు మాత్రమే తెలిసిన పరంపరాగతమైన రహస్య ప్రక్రియ.

 

ఈ వాకిలికి బంగారు వాకిళ్లు అనే వ్యవహారం చాలాకాలం ముందు నుంచే ప్రశస్తిగాంచింది. క్రీ.శ.15వ శతాబ్దంలో తిరుమలను తొలిసారి దర్శించిన తాళ్లపాక అన్నమయ్య కనకరత్నకవాట కాంతు లిరుగడ గంటినని, ఆ పసిడి టక్కలతల వాకిటి నుంచే కనిపించే తిరువేంకటాచలాధీశుడు కన్నులారా దర్శించానని వక్కాణించాడు. 

 

అనంతరం ఈ వాకిలికి ఎన్ని పర్యాయాలు బంగారు రేకుల తాపబడినదో తెలియదు. కానీ 1884లో మహంతు ధర్మదాసు బంగారు రేకు తొడుగు వేయించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1958 సంవత్సరంలో ఆనంద నిలయ విమాన మహాసంప్రోక్షణ సమయంలో ఈ వాకిలికి బంగారు మలాము వెయ్యబడింది.

 

అనాదిగా ఈ బంగారు వాకిళ్ళలో బ్రహ్మేందారి దేవతలు ఎందరు నడిచారో.. ఎన్నిసార్లు నడిచారో.. సనకసనందనాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్నిమార్లు పడిగాపులు కాచారో.. ఆళ్వారులు, కర్ణాటక, హరిదాసులు, అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజాధిరాజులు, చక్రవర్తులు ఇలా అనంతకాల ప్రవాహంలో ఎందరో మహాభక్తులు ఎందరెందరో భాగవతులు ఈ బంగారువాకిలి ముందు నిలిచి తరించారో.. ప్రవేశించి పరమశించారో.. ఏ జన్మలో చేసి ఉన్న ఏ భాగ్యలేశం చేతనో మనకూ ఆ మహనీయులు ప్రవేశించి తరించిన బంగారు వాకిళ్ళలో ప్రవేశిచే మహదవకాశం ఇప్పుడు లభించింది కదా... అది బంగారు వాకిలి ప్రాముఖ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి: